నాపై ఆరోపణలు చేయడం కాదు.. వాటిని రుజువు చేయండి’ అంటూ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ సవాలు విసిరారు. విజయవాడ పంజా సెంటర్లో ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంజాన్ తోఫా అందించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు తనపై ఎన్నో ఆరోపణలు గుప్పిస్తూ టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. కులాల పేరుతో చిచ్చు పెడుతున్నాయన్నారు. కావాలని కాపు సోదరుల సభలో ట్రైనుని తగులబెట్టారని ఆయన ఆరోపించారు.
రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నప్పుడు గతపాలకులు కేవలం రూ.200 కోట్లను ముస్లింల సంక్షేమానికి కేటాయించారని, ఇప్పుడు 13 జిల్లాలు ఉన్న ఏపీలో దాదాపు రూ.700 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు.
గత పాలకులు పద్ధతి ప్రకారం చేయకపోవటంతో కోర్టులో రిజర్వేషన్ల అంశానికి బ్రేక్ పడిందని చెప్పారు. 67 ఏళ్ల వయసులోనూ యువకుడిలా కష్టపడుతూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం కృషిచేస్తున్నారని కొనియాడారు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలకు మిగులు బడ్జెట్ ఉంది.. కానీ ఏ రాష్ట్రంలోనైనా ఇంతగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం లేదు’ అని ఆయన అన్నారు. టీడీపీ ఒక పద్ధతి ప్రకారం పాలన అందిస్తోందని ఆయన అన్నారు.