మలాలా యూసుఫ్ జాయ్ పేరు గుర్తుందా? పాకిస్థాన్ కు చెందిన ఈ బాలిక పేరు తెలియనవారు ప్రపంచంలో దాదాపుగా ఎవరూ ఉండరు. పాకిస్థాన్ లో తాలిబన్ ఉగ్రవాదులకు ఎదురొడ్డి నిలిచి బాలికా విద్యకు దన్నుగా నిలిచి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మలాలా పేరు మరచిపోవడం కూడా అంత తేలిక కాదు. చిన్న వయసులోనే నోబెల్ బహుమతి సాధించిన ఈ బాలిక... ప్రస్తుతం కోటీశ్వరుల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం పలు దేశాల్లో పర్యటిస్తున్న మలాలా... ఒక్క ప్రసంగం చేసేందుకు ఏకంగా రూ.కోటి తీసుకుంటోందని ఓ బ్రిటన్ పత్రిక ఆసక్తికర కథనం రాసింది.
పాకిస్థాన్ స్వత్ లోయలో తాలిబన్ల హయాంలో తన జీవితంపై ఆమె ‘ఐ యామ్ మలాలా’ పుస్తకాన్ని విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం ప్రచురణ హక్కులను సంరక్షిస్తున్న సంస్థ ‘సలార్జాయ్’ ఖాతాలో ఆగస్టు 2015 నాటికి రూ.19.98 కోట్లు (2.2 మిలియన్ పౌండ్లు) ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. సలార్జాయ్ సంస్థకు మలాలా తండ్రి జియాయుద్దీన్ యుసఫ్జాయ్, తల్లి తూర్ పెకాయ్ సంయుక్త భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.
ఈ పుస్తకం ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 18 లక్షల ప్రతులు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం బ్రిటన్లో ఉంటున్న మలాలా.. ఓ ప్రసంగానికి రూ.1.02 కోట్లు (1.14 లక్షల పౌండ్లు) వరకూ తీసుకుంటూ అత్యధికంగా సంపాదిస్తున్న నోబెల్ బహుమతి గ్రహీతల్లో ఒకరిగా మారినట్లు ఓ బ్రిటన్ పత్రిక వెల్లడించింది. వెరసి మాలాలా పుస్తకం ద్వారా వచ్చిన ఆదాయంలో ఆమె కుటుంబానికి కూడా పెద్ద మొత్తంలో వాటా దక్కిందని ఆ పత్రిక పేర్కొంది.