కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి.. మిగిలిన సమయంలో అభివృద్దే లక్ష్యంగా పని చేయాలి.. ఇదీ తరచూ చంద్రబాబు చెప్పే హితోక్తులు.. అభివృద్ది విషయంలో ప్రతిపక్షాలు అధికారపక్షంతో కలసి రావాలని ఆయన తరచూ చెబుతుంటారు. కానీ ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.
చంద్రబాబు తనపై కక్షతో సొంత జిల్లా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని రోజా మండిపడుతున్నారు. ఆమె తన నగరి నియోజవవర్గంలో వెటర్నరీ ఆస్పత్రి భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. ఈ ఆసుపత్రి కోసం భవనాలు నిర్మించారు తప్ప అందుకు సంబంధించిన సిబ్బందిని నియమించలేదని ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు.
వెటర్నరీ ఆసుపత్రిలో కొన్ని భవనాల నిర్మాణాలు పూర్తైనా సిబ్బంది లేని కారణంగా అవి నిరూపయోగంగా ఉన్నాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తాను వైసీపీకి చెందినందువల్ల.. తాను ఎమ్మెల్యేగా ఉండటం వల్లే ఈ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఒక్క విషయంలోనే కాదని.. తన నియోజకవర్గానికి చెందిన పనులు ఏమీ జరగనివ్వడం లేదంటున్నారు రోజా.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే అధికార ప్రభుత్వం ఇలాంటి డబుల్ గేమ్ ఆడుతోందంటున్నారు రోజా. ఇప్పటికైనా చంద్రబాబు రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలను ఆదుకోవాలని రోజా అంటున్నారు. చంద్రబాబు తన సొంత జిల్లా అని కూడా చూడకుండా చంద్రబాబు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.