నిప్పులా బతికాను.. నలభైయేళ్లు రాజకీయాల్లో ఉన్నా.. నాపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.. నితీకి, నిజాయితీకి మారు పేరు నేనే.. ఇవీ తరచూ చంద్రబాబు చెప్పే రాజకీయ డైలాగులు.. నీతి, నిజాయితీల సంగతి ఎలా ఉన్నా.. ఆయనపై కేసులు నమోదు కాలేదన్నమాట మాత్రం వాస్తవమే.
ఆయన పేరు ఎఫ్ ఐ ఆర్ లో ఎక్కలేదు. ఆయనపై చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదు. ఇంతవరకూ వాస్తవమే. కాకపోతే ఈ మాట బలంగా చెప్పే పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు. ఏడాది క్రితం వరకూ చంద్రబాబు ఈ మాటలు బాగానే చెప్పేవారు. కానీ ఓటుకు నోటు కేసు పుణ్యమా అని .. చంద్రబాబు ఈ డైలాగులు చెబితే ఇప్పుడు జనం నవ్వుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతం చంద్రబాబు ఇలా ఉన్నా.. ముందు ముందు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు అవినీతిపై వైసీపీ రూపొందించిన పుస్తకాన్ని ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రులందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందజేశామని.. వీటిపై ఏదో ఒక రోజు విచారణ జరుగుతుందని వైసీపీ నేత పద్మ అంటున్నారు.
చంద్రబాబుపై ఓటుకు నోటు అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే భయంతో పారిపోతున్నారని పద్మ ఎద్దేవా చేశారు. దీనితో పాటు రాజధాని భూ అక్రమ దందాపై దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించాలన్నారు. రాజధాని అక్రమ భూదందా, అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఓటుకు నోటు కేసు తదితర కేసులన్నీ త్వరలోనే విచారణకు వస్తాయని.. అప్పుడు బాబుకు ముందుంది ముసళ్ల పండగ అని పద్మ హెచ్చరించారు.