వాస్తవానికి ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టు చెప్పొచ్చు. నిజానికి ప్రతిపక్షంలో ఉండటం కంటే బ్యాడ్ టైమ్ ఏముంటుంది. అయితే జగన్ కు అధికారం చేతిలో లేకపోవడం సంగతి పక్కకు పెడితే అక్రమాస్తుల కేసులు ఆయనకు తలనొప్పిగా మారే ప్రమాదం మొదటి నుంచి పొంచి ఉంది.
తాజాగా ఆయనకు చెందిన 730 కోట్లకుపైగా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. త్వరలో మరో వెయ్యి కోట్ల కు సంబంధించిన ఆస్తులను జప్తు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ పరిస్థితి కూడా అంత బాగా లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ నుంచి వలసలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 20 మందికి పైగా ఎమ్మెల్యేలు చేజారి పోయారు.
ఇంకో నలుగురు ఐదుగురు త్వరలోనే పార్టీ వీడతారని ప్రచారం జరుగుతోంది. ఇలా అన్నివైపుల నుంచి కష్టాలు చుట్టుముడుతున్న సమయంలో జగన్ పరిష్కారం కోసం జ్యోతిష్యాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో లోట్స్ పాండ్లోని తన భవనంలో జ్యోతిష్కులతో జగన్ మూడు గంటలపాటు గడిపారట.
కష్టాల నుంచి గట్టెక్కడానికి జ్యోతిష్కులు కొన్ని దోష నివారణ పూజలు చేయాలని జగన్ కు సూచించారట. గురువారం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలెవరినీ కలవకపోవడం కూడా ఇందుకేనని సమాచారం. అమెరికా పర్యటనకు వెళ్లబోతున్న కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వచ్చినా.. వారిని జగన్ కలవలేదట. జగన్ కు జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నట్టు చెబుతారు. గతంలో ఆయన రెండేళ్లలో నేనే సీఎం అవుతానని ధీమాగా చెప్పడం కూడా జ్యోతిష్యం ఫలితమే అంటారు.