ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లుకి బీజేపీ మద్దతు ఇవ్వాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై ఓటింగ్ జరగకుండా బీజేపీ వంకలు వెతుకుతోందని అన్నారు. ‘బీజేపీ బిల్లుకి మద్దతు తెలిపి తీరాలి.. లేదంటే వారికి ఇబ్బందులు తప్పవు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీది కూడా అదే పరిస్థితి అని చిరంజీవి పేర్కొన్నారు.
ఎన్నో పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ శ్రేయస్సుని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ‘బిల్లుకి మద్దతివ్వాల్సిందే.. లేదంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికే లేకుండా పోతుంది’ అని చిరంజీవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లుపై తొలుత ఓటింగ్ జరగాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. బీజేపీ కావాలని ముందుగా 13 బిల్లులపై చర్చ జరగాలని చెబుతోందని, చివర్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లు ప్రవేశపెడతామంటున్నారని...
చివర్లో సభను వాయిదా వేయించే కుతంత్రానికి తెరలేపిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముందుగా ఏపీ స్పెషల్ స్టేటస్ బిల్లుపై ఓటింగ్ జరగాల్సిందేనని, మొదట దానిని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయగా, ప్రొసీజర్ ప్రకారం సభ నడవాల్సిందేనని, ఆ తరువాత బిల్లులు ప్రవేశపెడతామని, అందులో ఏపీ స్పెషల్ స్టేటస్ బిల్లు కూడా ఉంటుందని బీజేపీ నేతలు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఇతర పక్షాల నేతలు నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది.