హరితహారంలో భాగంగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తన నివాసంలో మెుక్కుబడిగా ఒక మొక్క నాటింది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను సానియా మీర్జా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో సానియాతో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 



సెలబ్రెటీలంతా తలో మొక్కా నాటుతూ ఉంటే సానియా సైలెంట్‌గా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తన ఆటోబయోగ్రఫీ బుక్ కోసం ముంబైలో నానా హంగామా చేసిన సానియా, హరితహారం కోసం ఓ పదినిమిషాల సమయం కేటాయించకపోవడంపై విమర్శలు వచ్చాయి. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా రూ.2కోట్లు తీసుకున్న సానియా కనీసం రెండు మొక్కలైనా నాటలేదా ? అనే వ్యాఖ్యలు వినిపించాయి. 



ఆ విమర్శలు ఆమె చెవికి చేరాయో ఏమో కానీ చివరకి మొక్క నాటుతున్నట్లు ఓ ఫోటోకు  ఫోజిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చేతులు దులుపేసుకుంది. సానియా వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొక్కుబడి తంతు చేస్తే ఏంటి... చెయ్యకపోతే ఏంటి అని ప్రజలు చర్చించుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: