పార్లమెంటు అంటే ఆధునిక సమాజంలో ప్రజాస్వామ్య దేవాలయంలాంటింది. కానీ ఆ పార్లమెంటుకు కొందరు ఎంపీలు ఏకంగా మద్యం సేవించి మరీ వస్తున్నారట. గతంలో పార్లమెంటులో బూతువీడియోలు చూడటం.. సొల్లు కబుర్లు చెప్పుకోవడం. ట్యాబుల్లో టైంపాస్ చేయడం చూశాం. ఇప్పుడు ఈ ఎంపీ ఏకంగా తాగి మరీ వస్తున్నాడట. 

ఇంతకీ ఎవరా ఎంపీ అనుకుంటున్నారా.. ఆయనే తాజాగా పార్లమెంటులోపలి దృశ్యాలు కూడా వీడియో తీసి నెట్లో పెట్టి సంచలనం సృష్టించిన ఆప్ ఎంపీ భగవంత్ మాన్ సింగ్. ఈ విషయం బయటపెట్టింది ఎవరో కాదు.. తోటి ఎంపీయే. ఆయన ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా. ఈయన కూడా ఆప్ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. కాకపోతే ఏడాది క్రితం ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. 


అది వేరే విషయం అనుకోండి. కానీ ఎంపీ భగవంత్ మాన్ రోజూ తాగి సభకు రావడం వల్ల తనకు ఇబ్బందిగా ఉందని హరీందర్ సింగ్ ఏకంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ కు కంప్లయింట్ చేశారు. తాను నియమనిష్ఠలతో ప్రార్థన చేసుకుని సభకు వచ్చే తనకు మద్యం వాసన ఇబ్బందిగా ఉందని ఆయన తన కంప్లయింటులో పేర్కొన్నారు. 

తన సీటు తప్పకుండా మార్చాలని ఆయన విజ్ఞప్తి చేసుకున్నారు. స్పీకర్ ను కూడా కలిశారు. స్పీకర్ తప్పకుండా పరిశీలిస్తా అన్నదట. మొత్తానికి భగవంత్ మాన్ సింగ్ వీడియో పోస్టింగ్ ద్వారానే కాకుండా ఇలా తాగిన విషయంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడన్నమాట. కేజ్రీవాల్ గారూ వింటున్నారా.. మీ ఎంపీ గొప్పదనం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: