58 ఏళ్ల వైవాహిక బంధం వారిది. చివరిక్షణంలో మృత్యువు కూడా వారిని వేరు చేయలేకపోయింది. ముగ్గురు పిల్లలతో నిండు సంసార జీవితాన్ని ఆస్వాదించిన ఆ జంట చివరిఘడియల్లోనూ పక్కపక్కనే పడుకొని.. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తుదిశ్వాస విడిచింది. టెక్సాస్లోని సాన్ అంటోనియోలో ఈ ఘటన జరిగింది. దంపతుల పేర్లు సాన్ జార్జ్, ఒరా లీ రోడ్రిగ్యుజ్. చిన్నతనంలోనే ఓ మీట్ మార్కెట్లో వీరిరువురికీ పరిచయం ఏర్పడింది.
ఓ స్కూల్లో వీరిరువురు కలిసి చదువుకున్నారు. ఆ తరువాత మిలిటరీలో పనిచేసిన జార్జ్ ఒరా లీని వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. 58 ఏళ్ల వైవాహిత జీవితాన్ని ఒకరికి తోడుతో ఒకరు నిలుస్తూ గడిపారు. చివరికి వయస్సు మీద పడటంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇద్దరు దంపతులు పక్కపక్కనే చేతిలో చేయి వేసి పడుకున్నారు. నిద్రలోనే జార్జ్ గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత మూడు గంటలకు ఒరా కూడా పరమపదించారు.
ఈ నేపథ్యంలో దంపతులిద్దరు పక్కపక్కనే చేతులు పట్టుకొని పడుకొన్నారని, నిద్రలో తన తండ్రి జార్జ్ ప్రాణాలు విడవగా, ఆ తర్వాత మూడు గంటలకు తన తల్లి ఒరా కూడా కన్నుమూసిందని వారి కూతురు కొరినా మార్టినెజ్ స్థానిక ఫాక్స్ 29 చానెల్కు తెలిపింది. అచ్చం ‘నోట్బుక్’ హాలీవుడ్ సినిమాలో జరిగినట్టే తమ తల్లిదండ్రులు ఒకేసారి ప్రాణాలు విడిచారని, తుదిఘడియల్లోనూ వారు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని ఉన్నారని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారి అనుబంధం ఇందుకు కారణమని ఆమె వివరించింది.