భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రియో ఒలింపిక్స్లో సందడి చేయనున్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బ్యాచ్ ఆహ్వానం మేరకు సచిన్ ఒలింపిక్స్కు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్ రాజధాని రియో నగరానికి పయనం కానున్నాడు. రియోలో భారత్ ఒలింపిక్ బృందానికి గుడ్విల్ అంబాసిడర్ కూడా అయిన సచిన్ వచ్చేనెల 2న రియో వెళ్లి, అక్కడ మన అథ్లెట్లను కలుసుకోనున్నాడు. ఒలింపిక్స్కు వెళ్లడం సచిన్కు ఇదే తొలిసారి కావడం విశేషం.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆహ్వానం మేరకు వచ్చే నెల 2న ఆయన రియో డి జనీరోకు పయనమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులను గేమ్స్ను తిలకించేందుకు ఐఓసీ ఆహ్వానిస్తోంది. సచిన్ ఆగస్టు 2న రియో వెళ్లి భారత అథ్లెట్లను కలిసి వాళ్లను పతకం సాధించే దిశగా ఉత్సాహపరుస్తాడు అని సచిన్ సన్నిహితుడొకరు తెలిపాడు.
జికా వైరస్తో ముప్పున్న బ్రెజిల్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ను సచిన్ ఈ మధ్యే ముంబయిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేయించుకున్నాడు. ఇటీవల లండన్లో మోకాలికి సర్జరీ చేయించుకున్న సచిన్, ఒలింపిక్స్ మొదలయ్యేసరికి రియో వెళ్లేందుకు ఫిట్గా ఉంటాడని అతను వివరించాడు. మరోవైపు రోస్టర్ ప్రకారం 2024 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే విషయమై చర్చించేందుకు కూడా సచిన్కు ఈ రియో ట్రిప్ ఉపయోగపడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.