శ్రీశైలం పాతాళగంగకు వెళ్ళే మార్గంలో భారీగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. కృష్ణా పుష్కరాల కొసం నిర్మిస్తున్న ఘాట్ నిర్మాణ పనులు నిలిచి పోయాయి. పాతాళగంగకు పుణ్య స్నానానికి వెళ్ళే భక్తులకు ఆటంకం కలుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్నాయి.
క్లాక్ టవర్ నిర్మాణాంలో భాగంగా కొండను తొలచి పనులుచేపట్టారు. పాతాళగంగకు స్నానాలకు వెళ్ళే భక్తులను అనుమతించడం లేదు. కొండ చరియలు విరిగి పడుతున్న ప్రాంతాన్ని దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఆదివారం రాత్రి విరిగిపడిన కొండచరియను కర్నూలు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు.
కొండచరియలు విరిగిపడకుండా ఉండేందుకు లిఖితపూర్వకంగా సూచనలు ఇచ్చినప్పటికీ దేవస్థానం అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించి ప్రత్యేక అధికారితో విచారణ జరిపించనుందని వెల్లడించారు.
కొండచరియ విరిగిపడడానికి కారణమైన దేవస్థానం అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. క్రిమినల్ నెగ్లిజిన్స్ కోణంలో విచారణ జరుగుతుందన్నారు. కొండచరియలు విరిగి పడిన ఘటనపై బాధ్యులైన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కొండ చరియ విరిగిపడిన ప్రాంతంలో జనం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అదే జనం ఉంటే.. పుష్కరాల సమయంలో ఇలా జరిగితే.. వామ్మో ఇంకేమైనా ఉందా..?