తెలంగాణలోని ఆరు యూనివర్సిటీలకు వీసీలను నియమించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వీసీల నియామకంపై కేసు విచారణలో ఉండగా ప్రభుత్వం నియామకం చేపట్టడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉపకులపతుల నియామకం జరపకుండా రెండేళ్లు ఆగిన ప్రభుత్వం మరో రెండు మూడు రోజులు ఆగలేకపోయిందా? అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.



వీసిల నియామకాల నిబంధనలను సడలించడాన్ని సవాల్ చేస్తూ ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై వాదనలు సోమవారం ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విషయం కోర్టులో ఉండగా ఎలా వీసిలను నియమిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు తుది తీర్పునకు లోబడే వీసీల నియామకాలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.



విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సెలర్లను నియమించినంత మాత్రాన తదుపరి ఏం చేయాలో తమకు తెలియదని భ్రమించవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)కు ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి, ఉస్మానియా వర్సిటీ వీసీగా రామచంద్రం, వరంగల్ కాకతీయ వర్సిటీ వీసీగా సాయన్న, తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సాంబయ్య, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: