ఎంసెట్-2 ప్రశ్నపత్రం ముందుగానే బహిర్గతమైందన్న ఆరోపణలపై నాలుగు రోజులుగా ప్రాథమిక విచారణ జరుపుతున్న సీఐడీ దీనిపై సోమవారం కేసు నమోదు చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం కాబట్టి వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఐపీసీ 406, 408, 420 రెడ్ విత 120 (బీ), సెక్షన్ 8 ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన (ప్రివెన్షన ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అనఫెయిర్నె్స) చట్టం 1987 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్పటి వరకు కేసులో నిందితుల పేర్లు చేర్చలేదు. ప్రాథమిక విచారణలో సేకరించిన సమాచారం మేరకు తదుపరి దర్యాప్తులో లభించే ఆధారాల ద్వారా నిందితుల పేర్లు చేర్చనున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. కాగా కేసు తీవ్రత నేపథ్యంలో దీని పర్యవేక్షణ బాధ్యతను ఉన్నతాధికారులు డీఐజీ స్థాయి అధికారికి అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో ఆరు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
ఎంసెట్-2లో అవకతవకలు జరిగాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ జరపాలంటూ ఎంసెట్ కన్వీనర్ రమణారావు డీజీపీ అనురాగ్శర్మకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విచారణ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ అధికారులు కొంతమంది విద్యార్థులు, ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లిప్పిస్తామని తిరిగే కొన్ని కన్సల్టెనీల నిర్వాహకులు (దళారుల) మధ్య సంప్రదింపులు జరిగినట్లు గుర్తించారు. విద్యార్థుల ఆర్థిక పరిస్థితి, పరీక్షలకు ముందు వారు ఎక్కడున్నారు? దళారుల పూర్వాపరాలు ఆరా తీశారు. అయితే కేసు నమోదు చేయకపోతే వీరిని విచారించడం, అదుపులోకి తీసుకుని చట్టబద్ధంగా సమాచారం రాబట్టడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో కేసు నమోదుకే అధికారులు మొగ్గుచూపారు.
ఎంసెట్ పరీక్ష పత్రాలు ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్కు ఎంసెట్ నిర్వాహకులతోపాటు ప్రైవేటు వ్యక్తులు కూడా వెళ్లారా!? పేపర్ లీకేజీకి ఇక్కడే బీజం పడిందా!? ఇవే అనుమానాలను దర్యాప్తు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున జరిగిన లీకేజీ వ్యవహారంలో బయటి వ్యక్తులతోపాటు ఇంటి దొంగల ప్రమేయంపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ప్రశ్నపత్రం తయారీ, ప్రింటింగ్, సెట్ ఎంపిక, పరీక్ష నిర్వహణ, ఓఎంఆర్ పరిశీలన, ర్యాంకుల ప్రకటన ఇలా ప్రతి విషయంపైనా దృష్టిసారించిన సీఐడీ.. ఎక్కడ లీక్ జరిగేందుకు అవకాశం ఉందనే దానిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. పేపర్ తయారీలో ఎవరెవరు పాల్గొన్నారు? పేపర్ సెటింగ్, ప్రింటింగ్ పరిశీలించేందుకు ఎవరెవరు వెళ్లారనే దానిపై సీఐడీ ఆరా తీస్తోంది. పేపర్ ప్రింటింగ్ పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో అధికారుల వెంట కొందరు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారన్న సమాచారం మేరకు వారెవరనే విషయాన్ని తదుపరి దర్యాప్తులో సీఐడీ రాబట్టనుంది. ప్రైవేటు వ్యక్తుల్ని ఎందుకు తీసుకెళ్లారు? వెళ్లినవారు విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు చేసిన మధ్యవర్తులా!? అనేది దర్యాప్తులో తెలియనుంది.