సినిమా ఓ పరిశ్రమ.. కాకపోతే.. అసంఘటిత రంగంలో ఉంది. దీని అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తుంది. కానీ ఇలాంటి రాయితీలను అడ్డుపెట్టుకుని తమ పబ్బం గడుపుకునే సినీ పెద్దలు పరిశ్రమకు మాత్రం ఏమీ చేయరు. అలాంటి వాటిలో హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఒకటి అంటున్నారు సామాజిక వేత్తలు.
హైదరాబాద్ లో సినిమా రంగం స్థిరపడాలన్నకోరికతో అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా ఫిల్మ్ నగర్ లో భవన ప్రమాదం నేపథ్యంలో ఈ ఫిల్మ్ క్లబ్ అక్రమాలుపై స్పందించేందుకు సామాజిక వేత్తలు ముందుకొస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమాలను వెలికితీయాలని సామాజికవేత్త ఎల్లారెడ్డి హైదరాబాద్లో డిమాండ్ చేశారు.
ఫిల్మ్నగరంలో ప్రస్తుతం ఉన్న క్లబ్, పార్క్, గార్డన్ స్థలమని ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు కట్టుకూడదన్న హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా నిర్మాణాలు చెపడుతున్నారని ఎల్లారెడ్డి ఆరోపించారు. 3.5 ఎకరాలను ప్రభుత్వం పార్క్ స్థలం కోసం ఉచితంగా హౌసింగ్ సొసైటీకి ఇచ్చిందని.. ఆ సంస్థలో నిర్మాణాలు చెపట్టి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో అనేక కమిషన్లు వేసినా.. వాటి నిదికలను బుట్టదాఖలు చేశారని ఆక్షేపించారు. ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీ ఇంచార్జీ ఆఫీసర్గా పని చేసిన కిరణ్మయి నివేదికను ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిల్మ్ క్లబ్లోని నిర్మాణలన్నీ అక్రమాలే అని ఆయన పేర్కొన్నారు. ఇందులో పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.