రియో ఒలింపిక్స్ లో ఈసారి భారత్ తన సత్తాచాటాలని క్రీడాభిమానులు ఆశగా ఎదురు చూస్తుంటే.. ఆటగాళ్లు మాత్రం ఆ ఆశలను ముందే నీరు గారుస్తున్నారు. రియో వరకూ వెళ్లకుండానే భారత్ లోనే ఆశలు గల్లంతు చేస్తున్నారు. రియో ఒలింపిక్స్ కు ముందే డోప్ పరీక్షల్లో వైఫల్యాలు భారత క్రీడాకారులను వెంటాడుతున్నాయి.
మొన్నటికి మొన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షల్లో ఫెయిలై అందరినీ ఆశ్చర్యపరిచాడు. లేదు అదంతా కుట్ర అని తన వాదన తాను వినిపిస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు షాట్ పుట్ క్రీడాకారుడు ఇంద్రజీత్ సింగ్ ఈ లిస్టులోకి వచ్చాడు. ఈ ఇంద్రజిత్ 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాడు. ఇతనిపై ఎన్నో ఆశలు ఉన్నాయి.
ఇంద్రజిత్ గతనెల 22న నిర్వహించిన డోప్ పరీక్షలో విఫలమైనట్టు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఏడు రోజుల్లో మరో శాంపిల్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని NADA ఇంద్రజిత్ కు సూచించింది. సూచించింది. అయితే A శాంపుల్ లో వచ్చిన ఫలితంపై ఇంద్రజిత్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు.
నర్సింగ్ తరహాలోనే ఇతడు కూడా కుట్ర వాదన వినిపిస్తున్నాడు. అసలు ఓ క్రీడాకారుడు తన అవకాశం దెబ్బతీసే పదార్థాలు ఎందుకు తీసుకుంటాడని ప్రశ్నిస్తున్నాడు. తన శాంపిల్ లో కుట్రపూరితంగా నిషేధిత ఉత్ప్రేరకాలకు చెందిన పదార్థాలను కలిపి ఉంటారని అంటున్నాడు. జాతీయ అకాడమీలో కాకుండా సొంత కోచ్ ను నియమించుకుని శిక్షణ తీసుకుంటున్న ఇంద్రజిత్ విషయంలో జాతీయ క్రీడల సమాఖ్య.. ఏంచేస్తుందో చూడాలి.