అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సొంత పార్టీ డెమొక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ శ్రేణులను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. 12 ఏళ్ల కిందట ఇదే వేదికపై అధ్యక్ష అభ్యర్థిగా ప్రసంగించిన ఒబామా.. ప్రస్తుతం రెండు పర్యాయలు పూర్తిచేస్తుకున్న శ్వేతసౌధం అధిపతిగా మాట్లాడుతూ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ తరపున దేశాధ్యక్ష పదవికి నామినేషన్ స్వీకీరించిన హిల్లరీని ప్రసంగం తర్వాత ఒబామా ఆలింగనం చేసుకున్నారు. దేశాన్ని సురక్షితమైన చేతుల్లో పెడుతున్నాని ఒబామా అన్నారు. అవసరమైనప్పుడు నన్ను ఎన్నుకున్నారు, ఇప్పుడు హిల్లరీని కూడా ఎన్నుకోవాలని ఆయన సమావేశాన్ని ఉద్దేశించి అన్నారు. నన్ను ఆదరించినట్లుగానే హిల్లరీని కూడా చూడాలని కోరారు.
నేను రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాను. అమెరికా భవిష్యత్తు పట్ల ఎప్పుడూ లేనంత ఆశాభావంతో ఉన్నాను. ఎన్నో ప్రమాణాల ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు మన దేశం ఎంతో శక్తిమంతంగా, సమృద్ధిగా ఉంది. గతవారం క్లీవ్ల్యాండ్లో జరిగిన రిపబ్లికన్ సదస్సులోని వ్యాఖ్యలు మనం విన్నాం. ఇవి ఎంతమాత్రం కన్జర్వేటివ్ అభిప్రాయాలు కావు. దేశ భవిష్యత్తు గురించి ఎంతో నిరాశాపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పి ప్రపంచం నుంచి అమెరికాను వేరే చేసేలా మాట్లాడారు. ఇది నిజమైన రిపబ్లికన్ పార్టీయేనా అనిపించింది.
నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో ద్వేషాన్ని ఓడించాలి, భయాన్ని వదిలేయాలి, ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకోవాలని ఒబామా పిలుపునిచ్చారు. హిల్లరీ క్లింటన్ను అమెరికా దేశాధ్యక్షురాల్ని చేయాలన్నారు. ఈ గొప్ప దేశం ఆ వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలు తనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిన ఒబామా, ఇలాగే ముందుకు వెళ్దాం అన్నారు. ఇదే సమావేశంలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్పై ఒబామా విమర్శలు చేశారు. ట్రంప్ ప్రజా కంఠకుడని ఆరోపించారు. మన విలువల్ని తప్పుపట్టేవాళ్లు ఎవరైనా, ఫాసిస్టులైనా, కమ్యూనిస్టులైనా, జిహాదీలైనా, ప్రజా కంఠకులైనా, వాళ్లు చిట్టచివరకు ఓటమిపాలవుతారని అన్నారు.