కేంద్ర ప్రభుత్వమే 3.9 శాతం ఆర్థిక లోటులో ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని రాష్ట్రాలకూ రావాల్సిన కేంద్ర ప్రభుత్వ వాటాల్లో ఎలాంటి లోటూ రానీయకుండా సర్దుబాట్లు చేస్తూ వస్తున్నామని, పదే పదే అదనపు నిధులు కావాలని అడుగుతూ ఉంటే ఎలా తెచ్చివ్వాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు.  రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 14వ ఆర్థిక సంఘాన్ని నియమించామని వారు ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో ఏ రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలన్న విషయమై, తమ వద్ద సమగ్ర సమాచారం ఉందని, దానికి అనుగుణంగానే సాగుతున్నామని వివరించారు. 



ఆంధ్రప్రదేశ్ విభజనకు పూర్వం ఎంతో అభివృద్ధి చెందిన అధికాదాయ రాష్ట్రమని గుర్తు చేసిన ఆయన, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలతో ఎందులోనూ తీసిపోలేదని అన్నారు. ఆపై కాంగ్రెస్ చేసిన పని వల్ల రాజధాని నగరాన్ని పోగొట్టుకున్న ఏపీ ఆర్థిక లోటులో కూరుకుపోయిందని, నా సహచర సభ్యులు సైతం ఇదే విషయాన్ని చెప్పారని వివరించారు. 



గత ప్రభుత్వపు అడ్డగోలు విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి తలెత్తుకు నిలిచేందుకు ఇంతవరకూ కేంద్రం ఎంతో సాయం చేసిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందిన సహాయాన్ని, విభజన చట్టాన్ని అమలు చేస్తున్న తీరునూ ఆయన సభ ముందు చదివి వినిపించారు. ఏపీకి కల్పించిన సౌకర్యాలపై జైట్లీ తెలిపిన అంశాల్లోని ముఖ్య వివరాలివి...



* విభజన చట్టం సెక్షన్ 9లో ఉన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకూ అదనపు పోలీసు ఉద్యోగాలను కేటాయించాం.
* హైకోర్టును విభజించాలని తెలంగాణ పట్టుబడుతోంది. అందుకూ ప్రయత్నిస్తున్నాం.
* సెక్షన్ 46 ఎంతో ముఖ్యం. ఆదాయ పంపిణీపై ఉంది. జనాభా ప్రాతిపదికన 58 శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకూ కేటాయించాం.
* ఏపీలో వెనుకబడిన జిల్లాలను ఆదుకునేందుకు నిధులు అందించాము.
* సెక్షన్ 90లో తెలిపిన విధంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులిస్తున్నాం.
* ఒకసారి పార్లమెంటులో చట్టం ఆమోదం పొందిన తరువాత మరేమీ చేయలేము.
* సెక్షన్ 93లోని 13వ షెడ్యూల్ లో పేర్కొన్న విధంగా పలు జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేశాం.
* ప్రధాని ఎంతో చొరవ తీసుకుని ఏపీ పారిశ్రామికాభివృద్ధికి ఎంతో చేశారు. 
* ఐఐటీని ఇప్పటికే ప్రారంభించాం. ఎన్ఐటీ కూడా పనిచేస్తోంది. ఐఐఎం లో విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది.
* రాష్ట్రం ఏర్పడి కేవలం రెండేళ్లే అయింది. ఎన్నో సంస్థల ఏర్పాటు దిశగా, ఏపీ సర్కారును స్థలం అడిగాము.
* జాతీయ వర్శిటీ ఏర్పాటుకు స్థలాన్ని చూశాం. 
* పట్టణాభివృద్ధి దిశగా విశాఖకు మెట్రోను ప్రకటించాం. దానికి ప్రాథమిక అనుమతులు వచ్చాయి.
* సున్నితమైన రైల్వే జోన్ విషయంలో అదే రాష్ట్రం నుంచి ఎంపికైన సురేష్ ప్రభు చర్చిస్తున్నారు. 
* జాతీయ హైవేలను నితిన్ గడ్కరీ ఇప్పటికే ప్రకటించారు.
* కృషి సంచాయ్ యోజన కింద 8 ప్రాజెక్టులు చేపట్టాము. 
* నీటి పారుదల రాష్ట్రాల బాధ్యతే అయినా, ఏపీ విషయంలో కల్పించుకుని నిధులిచ్చాం.
* రాజధానిని నిర్మించాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. దశలవారీగా నిధులిచ్చేందుకు సిద్ధం.
* మా హామీలను నెరవేర్చుకోవడానికి కూడా నిధులు ఉండాలి కదా?


మరింత సమాచారం తెలుసుకోండి: