తెలంగాణలో మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఊరట కలగనుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఇబ్బందులు ఇక కొంతైనా తొలిగిపోనున్నాయి. సుదూర ప్రాంతాలనుంచి హైదరాబాద్కు వచ్చి డయాలసిస్ చేసుకోవాల్సిన ఆగత్యం లేకుండా ఇక స్థానికంగానే అన్ని వసతులతో కూడిన డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రజలకు మెరుగైన వైద్య సదుపాన్ని కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో కిడ్నీ రోగుల సంఖ్య అధికంగా ఉండటంతో వారి కోసం ప్రస్తుతం సేవలందిస్తున్న వాటికి అదనంగా.. కొత్తగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 చోట్ల డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే ఈ-టెండర్లను పిలిచింది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ-టెండర్ల కార్యక్రమం చేపట్టింది.
గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా నూతన డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
కిడ్నీ చెడిపోయి, మార్పిడి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో... దాతలు దొరకని వాళ్ళు, డయాలసిస్ మీద ఆధారపడి మాత్రమే బతుకుతున్నారు. వీరిలో దాదాపు జిల్లా, మండల, గ్రామీణ ప్రాంత వాసులే. వీరికి స్థానికంగా డయాలసిస్ సెంటర్లు అందుబాటులో లేకపోవడంతో.. హైదరాబాద్ కు రావాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. డయాలసిస్ కేంద్రాల కొరత ఉండటంతో.. ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
ప్రైవేటు దవాఖానల్లో ఒక్కసారి డయాలసిస్ చేయించుకునేందుకు రూ. 4000 వరకు ఖర్చు అవుతుంది. ఇక ఇప్పటినుంచి స్థానికంగానే ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏర్పాటుకాబోయే డయాలసిస్ సెంటర్లలో దీనిని ఉచితంగా చేయించుకోవచ్చు. ఆరోగ్య శ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ నుంచి ప్రతీ రోగికి రూ. 1250 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. దవాఖానలకు భవనం, నీరు, విద్యుత్ సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. మిగిలిన ఏర్పాట్లన్నీ టెండరు పొందిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులే చూసుకుంటారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పిపిపి) పద్ధతిలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఆదిలాబాద్ రిమ్స్, పలు జిల్లా, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లలో సింగిల్ యూజ్ డయలైజర్తో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు బిడ్డర్ల నుంచి ఆన్ లైన్ టెండర్లను పిలిచింది. నూతనంగా ఏర్పాటు చేయబోయే డయాలసిస్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
* హైదరాబాద్ లోని మలక్పేట ఏరియా హాస్పిటల్
* రంగారెడ్డి జిల్లా వికారాబాద్, మహేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, తాండూరు జిల్లా హాస్పిటల్
* మహబూబ్నగర్ జిల్లా గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి ఏరియా హాస్పిటల్
* మెదక్ ఏరియా ఆసుపత్రి, సిద్దిపేట, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా హాస్పిటల్
* వరంగల్ జిల్లా ఆసుపత్రి, నర్సంపేట, ఏటూరునాగారం, జనగామ ఏరియా హాస్పిటల్, మహబూబాబాద్ * ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం ఏరియా హాస్పిటల్
* నల్గొండ జిల్లా ఆసుపత్రి, మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట ఏరియా హాస్పిటల్
* ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్, మంచిర్యాల, నిర్మల్ ఏరియా హాస్పిటల్, ఉట్నూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేయనుంది.
* నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, బాన్స్వాడ, బోధన్ ఏరియా ఆసుపత్రి
* కరీంనగర్ జిల్లా వైద్యశాలతో పాటు సిరిసిల్ల, జగిత్యాల, గోదావరిఖని ఏరియా ఆసుపత్రుల్లో నూతన డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.
వైద్యశాలల్లో ప్రత్యేకంగా కేటాయించే గదుల్లో ఈ డయాలసిస్ కేంద్రాలను నిర్మిస్తారు. తద్వారా ఆయా వైద్యశాలలకు వచ్చే రోగులకి నిర్ణీత సమయాల్లో డయాలసిస్ చేస్తారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ డయాలసిస్ కేంద్రాలను ఎంపిక చేసి, మార్గదర్శకాలను రూపొందించింది.