గడచిన సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ చావు దెబ్బ తిన్నది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ హవాతో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని సీట్లు కూడా రాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... పార్టీని బతికించే దిశగా చేస్తున్న యత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కారణమన్న
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సుప్రీం కోర్టులో పరువునష్టం దావా వేసింది. మరో రాష్ట్రంలో కూడా ఆర్ఎస్ఎస్ కేసు పెట్టింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా .. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ను అవమానించలేదని కపిల్ సిబాల్ సుప్రీం కోర్టులో చెప్పారు. అనంతరం ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ట్విట్ చేయడంపై బీజీపీ వర్గాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ద్వేషపూరిత మరియు విభజించే అజెండాపై తన పోరాటం కొనసాగుతుందని రాహుల్ ట్విట్ చేసిన మరుసటి రోజే స్వామి ఇలా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఆ ట్విట్ కూడా రాహుల్ చేసిన ఉండరని కార్యాలయంలో మరెవరో చేసి వుంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. జాతీయ ప్రాముఖ్యత కీలక అంశాలపై `యు-టర్న్' తీసుకోవడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని స్వామి ఘాటుగా విమర్శించారు.
ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేదని.. అతిపురాతన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడాలంటే రాహుల్ రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిందేనన్నారు. ఢిల్లీలో నేటి ఉదయం ఓ వార్తాసంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే... ఉన్నపళంగా రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందేనని స్వామి సలహా పడేశారు.