చేసింది కొన్ని సినిమాలే అయినా.. వాటితోనే ప్రేక్షకుల విశేష ఆదరనలను పొంది పవర్ స్టార్ గా పేరొంది సామాజిక అవగాహన ఉన్న హీరోగా పేరొందిన వ్యక్తే పవన్ కల్యాణ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అధికార, విపక్షాలు, ప్రజలందరు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే. అయితే ఈ విషయం పై ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని, ప్రజల తరుపున అండగా నిలబడాలని ఇప్పటివరకు చాలా మంది నేతలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే.
అయితే ఇన్ని రోజులు ఈ విషయం పై మౌనం వహించిన పవన్ నేడు ఈ విషయం పై ప్రజల ముందుకు వచ్చి మాట్లాడనున్నారు. పవన్ ఏం మాట్లాడుతారుని ప్రజలందరు ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతారు అనే విషయాన్ని పక్కన బెడితే పవన్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీకి సై అని చెప్పి, ప్రజల మద్దతు కూడగట్టడానికే ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ రాజకీయంగా పలుకుబడి సాధించాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే సరైన మార్గంగా పవన్ భావిస్తున్నారు.
పార్టీ ని స్థాపించడం కంటే ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన వాడే అసలైన నాయకుడు. పవన్ ప్రజా నాయకుడు కావడానికి తహ తహ లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నేడు త్రుప్తి బహిరంగ సభలో స్పష్టం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రజల్లో గూడుకట్టుకున్న భావోద్వేగాలు, హోదా చుట్టూ నడుస్తున్న రాజకీయంపై ఆయనకు స్పష్టత ఉందని, దీనిపై ఘాటుగానే స్పందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, యువత, రైతుల మనోభావాలను, రాజకీయ వాతావరణాన్ని ప్రస్తావించనున్నారని చెబుతున్నాయి.
ఈ క్రమంలో జనసేన పార్టీ ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించనుందో వెల్లడిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. శుక్రవారం తిరుమలలోనే బస చేసిన పవన్ తన ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు చేయడంలో నిమగ్నమయ్యారు. ఏ సమయంలో మైదానానికి చేరాలి, ఎంతసేపు వేదికపై ఉండాలనే అంశాలపై స్థానిక నేతలు, పార్టీ ముఖ్యులతో చర్చించారు. కొందరు ముఖ్యులు, అర్చకులు, పండితులతో సమావేశమయ్యారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి వెళ్లి సాయంత్రం జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. తిరుపతి సభ జనసేన పార్టీ తదుపరి ప్రస్థానానికి నాంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.