విల్లు నుంచి వచ్చిన బాణం, నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేమని జనసేన అధినేత, సినీ నటుడు పవన్కల్యాణ్ అన్నారు. శనివారం తిరుపతి వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఏదైనా మాట్లాడేటప్పుడు తాను ఆచితూచి మాట్లాడతానని అన్నారు. ఒక దేశపు సంపద అంటే ఖనిజాలు కావని, యువతే దేశ సంపద అని పునరుద్ఘాటించారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, సమాజం, దేశంపై వ్యామోహం ఉందని అన్నారు. తాను రూ.కోట్లు సంపాదిస్తానని, కోట్ల పన్ను కడతానన్న పవన్.. తనకు సమాజం మీద బాధ ఉందన్నారు. వర్తమాన రాజకీయాలు, నేతలు యువతకు మేలు చేయకపోవడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.
సినిమాల్లో సమస్యలకు రాందేవ్ బాబా 2 మినిట్ నూడిల్స్ లా ఇన్ స్టెంట్ పరిష్కారాలు దొరుకుతాయని అన్నారు. కానీ వాస్తవ జీవితంలో అలా జరగవని అన్నారు. తాను ముఖ్యంగా మూడు విషయాలు మాట్లాడేందుకు వచ్చానని ఆయన అన్నారు. తిరుపతిలోనే ఎందుకు మాట్లాడాలని నిర్ణయించుకున్నానంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు, ప్రధానిగా మోదీకి మద్దతు పలికింది ఇక్కడి నుంచేనని ఆయన చెప్పారు. అభిమానులు ప్రశాంతంగా ఉంటే, సంయమనం పాటించి ఉంటే అన్ని విషయాలు సవివరంగా మాట్లాడతానని ఆయన అభిమానులను ఉద్దేశించి అన్నారు.
పెదవి దాటిన మాట మళ్లీ తీసుకోవడం కష్టమని జనసేన పార్టీ అధినేత, పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రం విడిపోయి సమస్యల్లో ఉన్నప్పుడు ఇరకాటం పెట్టే విమర్శలు చేస్తూ.. రాజకీయ లబ్ది పొందే విమర్శలు చేస్తూ ఉండడం నాకిష్టం లేదు. నరేంద్రమోదే పవన్ తో జనసేన పార్టీ పెట్టించారన్నారు. జనసేనాని తెలుగు దేశం తొత్తులాగ పనిచేస్తున్నారని అన్నారు. నువ్వు గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అని కొందరు విమర్శలు గుప్పించారు’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
నన్ను ఏమైనా అనండి నేను సేవ చేయాల్సింది ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి అని పవన్ కల్యాణ్ ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. ‘నేను ఎక్కడికీ పారిపోను. నా రాష్ట్రం కోసం దేశం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను. మాట ఇస్తే వెనక్కితగ్గను మడమ వెనక్కి తిప్పను. ప్రజాసేన భజన సేన అంటున్నారు. అవును భజన సేనే ప్రజా సమస్యలపై భజన చేస్తా. నేను మోదీ భజన చేయలేదు. నేను మోదీ భజన చేశానని సీపీఐ నారాయణ అన్నారు. వామపక్ష పార్టీల పోరాటాలు అంటే నాకు గౌరవం. మా నాన్న ఓ క్రామేడ్ రాసిన పుస్తకాన్ని నాకిచ్చారు. దాన్ని చదివాను. చెగువేరా అంటే నాకు చాలా ఇష్టం. దేశం కోసమే నా పోరాటం’ అని పవన్ వ్యాఖ్యానించారు.