అధికారంలోకి వస్తే ఒకలాగ, ప్రతిపక్షంలో ఉంటే మరొకలాగా ఉండకూడదని టీడీపీ నేతలకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేస్తే ఒకలా, ఓడిపోతే ఇంకొకలా ఉండవద్దని ఆయన అన్నారు. అసలు ఎవరైనా రాజకీయాల్లో అడుగు పెట్టేదే ప్రజలకు సేవచేయడానికి అని ఆయన గుర్తుచేశారు. ప్రజా సేవ మానేసి రాజకీయ ప్రయోజనాలు అంటూ తాత్సారం చేస్తామంటే ఎలా? అని ఆయన అడిగారు.
ప్రజాసేవలో ఒకసారి అడుగు పెట్టిన తరువాత మెడతెగిపడాలి కానీ అడుగు వెనక్కి పడకూడదని, తన అడుగు వెనక్కి పడదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో వివాదాలు వద్దని, నిధులివ్వరని భయంగా ఉందని పదే పదే చెబుతుంటారని పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు గారూ...అసలు ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్రం అంటే ఎందుకు భయపడాలి? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న వారు కూడా మనుషులే కదా? అని ఆయన చెప్పారు.
మీరు అలా భయపడుతున్నారంటే మీకు ఏవైనా లొసులుగులు ఉన్నాయా? సీబీఐతో భయపెడతారన్న భయం ఉందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీ దగ్గర ఏ లోసుగులు లేకపోతే, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పదేపదే కించపరుస్తుంటే పోరాడడానికి మీకున్న సమస్య ఏంటి? అని ఆయన నిలదీశారు. పార్లమెంటులో మీ గొంతు వినిపించండి, పార్లమెంటును స్తంభింపచేయండి అని ఆయన సూచించారు. అలా చేయకుండా వారిదగ్గర ఎంత కాలం భయపడతారని ఆయన అడిగారు.
అప్పట్లో ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పోరాడలేదని, సోనియా గాంధీ ముందుకు వెళ్లి మేడమ్, మేడమ్ అంటూ బతిమాలేవారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటాన్ని ఏపీకి చెందిన ఎంపీలు ఎందుకు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. సమస్య ఎక్కడుంది? ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు చదువుకోలేదా?
కేంద్రం ముందు ఎందుకు సాగిలపడుతున్నారు? సార్ సార్ అంటూ ఎన్ని సార్లు అడుక్కుంటారు? మీరెందుకు అంతలా లొంగిపోతున్నారు? మీకు సిగ్గులేదు, గౌరవం లేదు, గులాంగిరీ చేస్తున్నారా? అందుకే అక్కడికెళ్లారా? పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల హక్కుల కోసం పోరాడండి అని ఆయన సూచించారు. 'పోరాడండయ్యా, ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం తాకట్టుపెట్టకండి' అని ఆయన సూచించారు.