తమిళనాడు స్తంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. సంక్షోభంలోకి జారిపోతున్న వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ.. తమిళనాడు అన్నదాతలు ఒక్కరోజు బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగం యావత్ బంద్ లో పాల్గొని ఆందోళనబాట పట్టింది. వారికి రాష్ట్ర ప్రజలు సంపూర్ణ సహకారం తెలిపారు. వ్యాపార సముదాయాలు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేసి రైతులకు మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్దతు తెలపడంతో.. పూర్తిస్థాయిలో బంద్ కొనసాగుతోంది.
పొరుగు రాష్ట్రాల నుంచి నదీ జలాల విడుదల కోసం అన్నదాతలు తమిళనాడు బంద్ చేపట్టారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచి నదీ జలాలు ఆగిపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్రవ్యాప్త బంద్తో తమ నిరసన తెలిపారు. తాజాగా మరికొన్ని సంఘాలు ఇవాళ మరోమారు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. దీనికి పలు రాజకీయ పార్టీలు, సంఘాల మద్దతు కూడగట్టుకున్నాయి. సుమారు వెయ్యి ప్రాంతాల్లో రాస్తారోకోలు, వంద చోట్ల రైల్రోకోలు నిర్వహించేందుకు రైతు సంఘాల సమన్వయ కమిటీ సన్నాహాలు చేసింది.
రైతుల ఆందోళనకు వివిధ వర్గాల మద్దతు లభిస్తోంది. ఈ ఆందోళనల్లో డీఎంకే, కాంగ్రెస్, టీఎంసీ, ముస్లిం లీగ్, వీసీకే తదితర పార్టీలూ పాల్గొంటున్నాయి. దీనికి లారీ యజమానుల సమ్మేళనం సైతం మద్దతు ప్రకటించింది. దీని ద్వారా తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే 1.32 లక్షలు, తమిళనాడులో తిరిగే 2.56 లక్షల లారీలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ. వంద కోట్ల మేర కార్యకలాపాలు స్తంభించనున్నాయి. అలాగే రాష్ట్ర టిప్పర్ లారీ యజమానుల సమ్మేళనం కూడా రాష్ట్రవ్యాప్త బంద్కు సంఘీభావం తెలిపింది. దాదాపు లక్ష టిప్పర్ లారీలు సమ్మెలో పాల్గొంటున్నాయి.