ఇన్నాళ్లు కార్పోరేట్
ఉద్యోగాలంటేనే సాఫ్ట్ వేర్ కంపెనీలు కళ్లముందు కదిలేవి. కానీ ఇప్పుడు
కార్పోరేట్ కంపెనీల కల్చర్ నేర సామ్రాజ్యానికి కూడా పాకింది అంటే కాస్త ఆశ్చర్య పోవాల్సిందే
మరి. తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపించక మానదు. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లోనూ
నేర సామ్రాజ్యం కార్పొరేట్ కల్చర్ ను అందిపుచ్చుకుంటోంది. పాశ్చాత్య దేశాల్లో
మాదిరి నేరాలు చేయడానికి కూడా ఉద్యోగులను నియమించుకుంటూ అరాచకాలు చేసే స్థాయికి నేరగాళ్లు
ఎదిగిపోతున్నారంటే నోరెళ్ల బెట్టాల్సిందే
మరి.
తాజాగా ఢిల్లీలో ఓ వ్యభిచార ముఠాను అరెస్టు చేసిన పోలీసులు... అమ్మాయిల అక్రమ రవాణా, వ్యభిచారం కార్పొరేట్ స్టైల్ లో జరగడం చూసి అవాక్కయ్యారు. వ్యభిచార రాకెట్ నడిపే హుస్సేన్ (50), సైరా భాను (45) లను అరెస్టు చేసిన పోలీసులు వారిని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో ఈ దందా గురించిన ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అసోం రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి అమ్మకాలు సాగించినట్టు గుర్తించారు.
ఇలా అమ్మకాలు సాగించే వారిని ఈ ముఠానే ఉద్యోగులుగా నియమించుకుంది. వారిని అసిస్టెంట్లుగా వ్యవహరించేది. వారు అమ్మాయిలను తీసుకొచ్చి, మేనేజర్లకు అమ్మేవారు. ఈ మేనేజర్లు వారిని ఈ వృత్తిలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి అప్పగించే వారు. వారు ఇలా కొనుగోలు చేసిన అమ్మాయిలతో ప్రాస్టిట్యూషన్ వృత్తిని కొనసాగిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఇలా నియమించుకున్న కింది స్థాయి బ్రోకర్లకు ఈ ముఠా నాయకురాలైన సైరా భాను జీతాలిచ్చి పోషించేది. ఇలా కొనుగోళు చేసిన అమ్మాయిలను సైరాబాను విటుల వద్దకు వారే పంపేధి. ఎవరైన అమ్మాయి ఎదురు తిరిగితే కఠినమైన వారిని కఠినంగా శిక్షించే వారని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు.
సైరాబాను నియమించిన ఉద్యోగులు 50 వేల రూపాయలకు ఒక అమ్మాయిని కొనుగోలు చేసి, 2 లక్షల రూపాయలకు అమ్మేసేవారు. అమ్మాయి వయసు ఎంత తక్కువైతే అంత ఎక్కువ డబ్బుకు అమ్మేసేవారు. ఇలా వారు వంద కోట్ల రూపాయలు సంపాదించారంటే ఎంత మందిని కొనుగోలు చేసి, ఎంతమందిని అమ్మారో వీరి అరాచకాలు ఎంత ఘోరంగా జరిగి ఉంటాయో అర్థమవుతోంది. ఇవి ప్రాధమిక విచారణలో వెలుగు చూసిన విషయాలు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఇలాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయి? వీరి వెనుక ఉన్న సిండికేట్ ఎవరు? వంటి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం అయిందా లేక ఇతర నగరాలకు కూడా విస్తరించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మొత్తానికి నేరప్రవృత్తి కార్పొరేట్ కల్చర్ స్టైల్లో కొనసాగుతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.