ఏపీ సీఎం చంద్రబాబు ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. ప్రతిపక్షాలతో బీజేపీ, జనసేన వంటి మిత్రపక్షాలు కూడా బలోపేతం అవుతుండటంతో రోజురోజుకు టీడీపీకి అగ్నిపరీక్షగా మారుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు రోజుకో చిక్కు ఎదురవుతోంది. వీటిని ఎదుర్కోవడంతో పాటు, సొంత పార్టీలో నెలకొన్న అసంతృప్తులు సవాల్గా మారుతున్నాయి.
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకా ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉన్నా పాలనపై దృష్టి పెట్టేందుకు కేవలం మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంటుంది. చివరి ఏడాదంతా 2019 ఎన్నికల కోసం భారీ కసరత్తులే జరుగుతాయి. ఈ నేపథ్యంలో పాలనను సరైన గాడిలోకి ఇప్పుడే పెట్టాల్సిన పరిస్థితి. పార్టీలోని అసంతృప్తులకు చెక్ పెడుతూ పాలనను ఫర్ఫెక్టుగా ముందుకు తీసుకెళ్లడానికి మరికొందరు పార్టీ నేతలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మంత్రి వర్గ విస్తరణకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారు.
వలస ఎమ్మెల్యేల పరిస్థితి..?
అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. మంత్రి వర్గ విస్తరణలో పార్టీలో ఉన్న సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వాలా? లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ మేరకు తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలా అన్నది చంద్రబాబు ముందున్న పెద్ద సవాల్. ప్రతిపక్ష వైసీపీకి చెందిన మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంది. మిగిలిన హామీల సంగతి ఎలా ఉన్నా.. వారిలో గరిష్టంగా నలుగురికి మంత్రి పదవి హామీలు ఇఛ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో భూమా, జ్యోతుల, జలీల్, రంగారావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు అందరూ సీఎం చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాదని.. ఎంత మంది వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారనేదే ఇప్పుడు హాట్ టాపిక్.
ఇన్ కమింగ్ - ఔట్ గోయింగ్
ఎవరికి ఉద్వసన ఉంటుంది? ఎవరికి పదవులు అందుతాయన్న విషయంపై ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోన్న విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం. చూస్తూ అవుట్ లిస్ట్లో ప్రత్తిపాటి పుల్లారావు (గుంటూరు జిల్లా), రావెల కిషోర్బాబు (గుంటూరు జిల్లా), కిమిడి మృణాళిని, (విజయనగరం జిల్లా), సిద్ధా రాఘవరావు (ప్రకాశం జిల్లా), పరిటాల సునీత (అనంతపురం జిల్లా), పొంగూరు నారాయణ (నెల్లూరు జిల్లా), (సీఆర్డీఏ చైర్మన్ పోస్టు ఇస్తారని టాక్), కొల్లు రవీంద్ర (కృష్ణా జిల్లా).
ఇక ఇన్ లిస్ట్ చూస్తే ఇందులో... కోడెల శివప్రసాద్రావు (గుంటూరు జిల్లా), శ్రీరాం తాతయ్య (కృష్ణా జిల్లా), పయ్యావుల కేశవ్ (అనంతపురం జిల్లా), భూమా నాగిరెడ్డి (కర్నూలు జిల్లా), సుజయ కృష్ణ రంగారావు (విజయనగరం జిల్లా), జ్యోతుల నెహ్రూ (తూర్పుగోదావరి జిల్లా), పి.అనిత (విశాఖ జిల్లా), మైనార్టీ కోటాలో ఎవరో ఒకరికి (దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది).
విస్తరణలో భాగంగా శాఖల మార్పు, ప్రాధాన్యం, తగ్గింపు విషయం పరిశీలిస్తే.. నిమ్మకాయల చినరాజప్ప, పీతల సుజాత, గంటా శ్రీనివాసరావు వంటి వారు ఉన్నట్టు తెలుస్తోంది.
నిజానికి టీడీపీ సర్కార్ కొలువుదీరి రెండున్నళ్లు అవుతున్నా పలు కీలక శాఖలకు మంత్రులు లేకుండా పాలన సాగుతోంది. విద్యుత్, పరిశ్రమలు, పర్యాటకం, మౌలికసదుపాయాల వంటి శాఖలకు మంత్రులు లేకుండానే సగం రోజులు గడిచిపోయింది. ఇక తాజా విస్తరణలో లోకేష్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు లోకేష్కు పదవి ఇవ్వవడంతో పాటు.. పార్టీలో పదవులు ఆశిస్తున్న సీనియర్లను కూడా పదవులతో మెప్పించాలి. అటు వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇచ్చిన హామీలు మొత్తంగా మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద సవాల్గా మారనుంది. బాబు ఈ సవాల్ను ఎలా అధిగమిస్తారో చూడాలి.