గతంలో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసులో ఇటీవలే హైకోర్టు విచారణ జరిపి స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే, స్టేను సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను వ్యతిరేకించింది. ఓటుకు నోటు కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున ఆ కేసు విషయంలో తాము కల్పించుకోబోమని చెప్పింది. హైకోర్టుకు ఈ కేసులో పలు ఆదేశాలు జారీ చేస్తూ నాలుగు వారాల తర్వాత కేసుపై విచారణ చేపట్టి, వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోగా హైకోర్టు ఏ నిర్ణయం వెలువరించని పక్షంలో పిటిషనర్ మరోసారి సుప్రీంకోర్టుకు రావచ్చని కూడా తెలిపింది. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఏసీబీ కోర్టు విచారణపై హైకోర్టు ఇచ్చిన 8 వారాల స్టేను సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నాప్రే వాదనలు వినిపించారు.
ఇది ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారమని, కేసును జాప్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దశలో స్టే విధించడం సరికాదని ఆయన చెప్పారు. తాము సమర్పించిన ఆధారాలతో ఏసీబీ కోర్టు సంతృప్తి చెందడం వల్లే ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణకు ఆదేశించిందని, దానిపై స్టేను తొలగించేలా చూడాలని కోరారు. అయితే.. కేసు విచారణపై హైకోర్టు 8 వారాల పాటుస్టే ఇచ్చిన నేపథ్యంలో కేసులో జోక్యం చేసుకోలేమని.. అయితే నాలుగు వారాల్లోగా కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టులకెళుతూ ఆయన ఎదుర్కుంటున్న కేసుల్లో స్టేలు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పందించారు. చంద్రబాబు ఇప్పటికి మొత్తం 18 కేసుల్లో న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో తన తప్పు లేకపోతే చంద్రబాబు స్టే ఎందుకు తెచ్చుకున్నారని ఆర్కే ప్రశ్నించారు. ఆ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, నల్లధనంతో తెలంగాణలోని ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోవాలని చూశారని ఆయన అన్నారు. పోలీసులకి చిక్కిన ఆడియో టేపుల్లోని వాయిస్ చంద్రబాబుదేనని ఆయన పేర్కొన్నారు. టేపుల్లో ఉన్న గొంతు తనది కాదని చంద్రబాబు ఇప్పటివరకూ చెప్పలేదని ఆయన అన్నారు. ఈ కేసులో ఆయనకు శిక్ష పడితీరుతుందని ఉద్ఘాటించారు.