పాకిస్థాన్ సరిహద్దులోని యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి దేశంలో సంచలనం సృష్టించింది. అయితే ఈ దాడికి సంబంధించి అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ నుంచి వచ్చి పకడ్బందీగా దాడిచేసి 18 మంది భారత జవాన్లను అంతంచేసిన ముష్కరులకు ఇంటిదొంగలు సాయం చేశారని జాతీయ దర్యాప్తు సంస్థదర్యాప్తులో తేలింది.


యూరీ ఆర్మీ క్యాంప్ లో సరుకురవాణా కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రిషిన్లుగా పనిచేస్తున్నవారిలో కొందరు స్థావరానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేడంతోపాటు ముష్కరుల తరఫున గూఢచర్యం కూడా నిర్వహించినట్లు వెల్లడైంది. యూరీ ఉగ్రదాడి కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఐఏ గురువారం కొందరు కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఉరీ లోని 12వ బెటాలియన్ క్యాంప్ లో దాదాపు 40 మంది సరుకురవాణా కూలీలు పనిచేస్తున్నారు.


జవాన్లు, అధికారులకు అవసరమయ్యే నిత్యావసరాలు, ఇతర సరుకులు తీసుకొచ్చే వీరంతా ప్రైవేటు వ్యక్తులే కావడం గమనార్హం. రోజూ వస్తూ పోయే ఈ పోర్టర్లకు క్యాంప్ లోపలి ఆవరణలో ఎక్కడెక్కడ ఏముందో కొట్టిన పిండి. పోర్టర్లు తీసుకొచ్చిన నిత్యావసరాలను నిలువ చేసే వంటశాలకు సమీపంలోనే ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించడాన్ని బట్టిచూస్తే.. ఆ మార్గం ఇంటిదొంగలు సూచించిందే అయిఉంటుందని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఉగ్రవాదులు రావడానికి ముందు ఇంటిదొంగలైన ఇద్దరు గూఢచారులు.. పాక్ సరిహద్దులోని కొండల నుంచి అటవీమార్గం గుండా యూరీ సైనిక స్థావరం వరకు రెండుమూడుసార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది.


అది ఉగ్రవాదులకు పూర్తిగా సురక్షితమైన మార్గమని నిర్ధారించుకున్న తర్వాతే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తన తోడేళ్లను రంగంలోకి దింపిందని అధికారులు అంటున్నారు. త్వరలోనే ఇంటి దొంగల పనిపడుతామని ఆర్మీ ఉన్నతాధికారులు అంటున్నారు. అటు పాకిస్తాన్ కు కూడా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరికలు జారీ చేశారు సైనికులు.


మరింత సమాచారం తెలుసుకోండి: