చంద్రబాబు ఏదైనా చేయాలనుకున్నా, ఎవరికైనా హ్యాండ్ ఇవ్వాలనుకున్నా అందుకు కొద్దికాలం ముందు నుంచే గ్రౌండ్ వర్క్ మొదలవుతుంది. ముఖ్యంగా మీడియా లీకులు హఠాత్తుగా మొదలవుతాయి. జనమంతా ఈ లీకుల్లోనూ లాజిక్ ఉంది కదా అని నమ్మిన తర్వాత ”ఆపరేషన్ మొండిచేయి” ముసుగు తీసుకుని బయటకు వస్తుంది. ఇప్పుడు మంత్రి పదవులకు ఆశపడి, చంద్రబాబు మాటలు నమ్మి వైసీపీ నుంచి టీడీపీలోకి దూకిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకుండా వదిలించుకునేందుకు లీకుల పర్వం మొదలైంది. తాజాగా లీకైన లీకు వార్తలను చూస్తే జనం కూడా చంద్రబాబు చెబుతున్న దానిలోనూ అర్థముంది కదా అన్న భావనకు రావడం ఖాయం.

గ‌వ‌ర్నర్ ను క‌లిసిన చంద్ర‌బాబు

ఫిరాయింపు ఎమ్మెల్యేల మంత్రి పదవులకు సంబంధించి బయటకొచ్చిన లీక్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కూడా వాడుకున్నారు. కొద్ది రోజుల క్రితమే గవర్నర్‌ నరసింహన్‌ను చంద్రబాబు కలిశారు. ఆ సమయంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించారని అన్ని ఛానళ్లు పెద్దపెద్ద బ్రేకింగ్‌లు నడిపాయి. అయితే లేటెస్ట్‌గా టీడీపీ నేతలు వదలుతున్న లీకేంటంటే… ఫిరాయింపు  ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను ఉన్నట్టు గవర్నర్‌కు చంద్రబాబు చెప్పారట. అదేమనగా… వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టుగా బాబు చెప్పగా, ఆ విషయంలో నరసింహన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారట. 

తెర‌పైకి త‌ల‌సాని ఇష్యూ ...

ఒకవైపు తెలంగాణలో తలసానిని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మీరే ఫిర్యాదులు చేశారు, ఆ అంశంపై ఒకటికి పది సార్లు నన్ను కలిశారు, ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుని, నా చేత ఎలా ప్రమాణ స్వీకారం చేయించాలని అనుకుంటున్నారు? అని అడిగాడట నరసింహన్! మరి ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతాడు చంద్రన్న? నీళ్లు నమలడం తప్ప! “అవును.. తెలంగాణ లో ఫిర్యాదు చేసింది నేనే, ఏపీలో అదే పని చేస్తున్నది నేనే.. నా రాజకీయం ఇలాగే ఉంటుంది.. దీన్ని అర్థం చేసుకుని నడుచుకోవాలి’’ అంటూ చెప్పగలడా? ఎంత రాజకీయ నేతలతో కలిసిపోయినా.. గవర్నర్ కు అన్నో ఇన్నో విలువలు ఉంటాయి కదా! వాటి మేరకు… ఆయన చంద్రన్న ముందు తన ధర్మ సందేహాన్ని ఉంచాడు. 

గ‌వ‌ర్న‌ర్ కు వ్య‌క్తం చేసిన ధ‌ర్మ‌సందేహం

ఇది బాబు గొంతుకు పచ్చి వెలగకాయ అయ్యింది…. అలాగే ఫిరాయింపుదారులకు కూడా. మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్లకు గవర్నర్ స్పందన మింగుడు పడే అంశం. గవర్నర్ వ్యక్తం చేసిన ధర్మసందేహానికి చంద్రన్న సమాధానం ఇవ్వలేకపోవడంతోనే, ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేటవుతోందనే వార్త కూడా  షికారు చేస్తోంది. అయితే.. గవర్నర్ ను మ్యానేజ్ చేయవచ్చు. కేంద్రం నుంచినో మరో వైపు నుంచినో ఆయనపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలో తాము ‘తప్పు’ అని తేల్చిన పనినే ఏపీ విషయంలో దగ్గరుండి చేయించగలడు చంద్రన్న.

గ‌వ‌ర్నర్ ఇబ్బంది పెట్టిన  చంద్రబాబు

అయితే పార్టీ సీనియర్లు మాత్రం ఈ లీక్ పై మరోలా స్పందిస్తున్నారు. చంద్రబాబును గవర్నర్‌ నిలదీసి ఉండవచ్చు… ఎందుకంటే తలసాని విషయంలో గవర్నర్ ను బాగా ఇబ్బంది పెట్టాం. కానీ చంద్రబాబు, గవర్నర్ మాత్రమే ఉన్న చోట జరిగిన సంభాషణ తమ పార్టీ నేతలకు ఎలా తెలిసిందని ధర్మసందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పక్కాగా తన అధినేత వదిలిన లీకే అయిఉంటుందని అనుభవంతో చెబుతున్నారు. బహుశా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎగ్గొట్టేందుకు ఈ ప్రచారం గాల్లోకి వదిలి ఉంటారని అంచనా వేస్తున్నారు.

వైకాపా నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తారా...

పిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై గవర్నర్‌ కూడా ప్రతికూలంగా స్పందించారని… తెలంగాణలో తలసానికి మంత్రి పదవి ఇవ్వడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని కాబట్టి ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడమే పార్టీ ప్రయోజనాలకు, ప్రజాస్వామ్యానికి మంచిదన్న భావనతో చంద్రబాబు ఉన్నారన్న మరో లీక్ ప్రచారం కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. 

ఇలా ఒక్కో లీక్‌తో స్టెప్‌ బై స్టెప్‌, ఇంచు బై ఇంచు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మానసికంగా చంద్రబాబు సిద్ధం చేస్తున్నారని టీడీపీ నేతలే అధినేత వ్యూహాలకు ముందస్తు రివ్యూ చేస్తున్నారు. మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎటు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలను చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: