భస్మాసురుణ్ణి ఎవరూ అంతం చేయనవసరం లేదు. వాడి చేతలే వాణ్ణి అంతం చేస్తాయి. అలాగే పాకిస్థాన్ “తాను త్రవ్వుకున్న గోతి లో తానే” పడబోతుంది. భారత్ పై ఉగ్రమూకలను రవాణాచేస్తున్న పాకిస్థాన్ కి, అదే ఉగ్రవాదం పక్కలో బల్లెం లా తయారవుతోంది.
బలూచిస్థాన్ లో చైనా విమాన వాహక నౌక
నిజం చెప్పాలంటే, భారత్ లో పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదం సృష్టించే మారణ హోమం కన్నా, అదే పాకిస్థాన్ పెంచి పోషించిన తీవ్రవాదం పాకిస్థాన్ లో సృష్టించే మారణ హోమమే ఎక్కువ. పాకిస్థాన్ లో సైనికులు, పాలకులు, ఐ.ఎస్.ఐ అక్కడి తీవ్ర వాదుల కనుసన్నల్లో పనిచేయవలసిందే లేదంటే వారి అంతు చూస్తారు అక్కడ. సైన్యం మాట వినకపోతే ఉగ్రవాదుల బ్రతుకు కుక్క బ్రతుకే. ఇది చాలాకాలం గా జరుగుతున్న చరిత్రే.
ఇక, తాజాగా మరోసారి పాకిస్థాన్ ఇరకాటంలో పడబోతుంది. అక్కడ సైనిక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ సమాజంలో 'యురీ సెక్టర్ పై తీవ్రవాద ఘటన' తర్వాత పాకిస్థాన్ ఏకాకి అయ్యింది. భారత్ లోకి పాక్ సైన్యం తీవ్రవాదుల్ని ఎగదోసిన వైనాన్ని ప్రపంచమంతా గుర్తించింది. 'ముందు మీ దేశంలో తీవ్రవాదాన్ని అదుపులో పెట్టండి, తీవ్రవాదులకు సాయాన్ని ఆపేయండి' అని అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి తేల్చి చెప్పడంతో, అక్కడ తీవ్రవాద సంస్థలు, సైన్యం అప్రమత్తం అయింది.
"చైనా - పాకిస్థాన్ పారిశ్రామిక కారిడార్" కి వ్యతిరేకంగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు భారత్ కు అనుకూలంగా ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. వారిని అణచివేసే క్రమంలో సైన్యం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. ఏం చేసినా, బలూచిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆందోళనలు తగ్గే పరిస్థితులు కన్పించడంలేదు. పైగా, ఈ రెండు ప్రాంతాల్లో భారత అనుకూల నినాదాలు ఊపందుకుంటున్నాయి. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు పెరిగితే, అంతర్జాతీయ సమాజం ముందు మరోమారు దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఈ వ్యవహారాలేవీ బయటకు రాకుండా పాకిస్థాన్ సైన్యం అక్కడ, భారత్పై యుద్ధానికి ముందస్తు సన్నాహాల్లో నిమగ్నమైపోయాయి. పాకిస్థాన్ ఆర్మీతోపాటు, అక్కడి వాయసేన కూడా తమ బలాన్ని ప్రదర్శించే పనిలో బిజీగా వుంది.
ఓ వైపు ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతున్న వేళ, పాకిస్థాన్ రెచ్చగొడుతున్నా భారత్ సంయమనం పాటించడం, వ్యూహాత్మక ఎత్తుగడగానే భావించాలి. ఈ సంయమనం ద్వారా పాక్ దమన నీతి ని ఐక్యరాజ్య సమితి లో ఎండ గట్టేందుకు భారత్ కి అవకాశం దొరికింది. అయితే, పాకిస్థాన్ లో ఎప్పుడు సంక్షోభం తలెత్తినా, అది భారత్కి పరోక్షంగా ప్రమాదకరంగా తయార వుతుంది. అక్కడి సైన్యం, పాకిస్థాన్ ప్రభుత్వంపై తిరగబడటం తో పాటు, భారత్ పై దండెత్తే అవకాశాలు పుష్కలం. ఇప్పుడే భారత్ మరింత అప్రమత్తంగా వుండాలి, ఆలోచించి అడుగెయ్యాలి.
బలూచ్, పిఓకె లో పాకిస్థాన్ ప్రదర్శించే దమన నీతిని “విశ్వ యవనిక పై దృశ్యం” లాగా ప్రపంచానికి చూపించాలి. అవసరమైతే మన వేగు వ్యవస్థను పటిష్ట పరచి ఆ రెండు రాష్ట్రాల ప్రజల్లో ఐఖ్యత సాధించి పెట్టి వారి చేతనే వివిధ దేశాల్లో పాకిస్థాన్ దమన నీతిని ప్రపంచం ముందు ఎండగట్టాలి. అలాగే మన జమ్ము & కశ్మీర్ పై పాకిస్థాన్ ప్రేమ లో ఉన్న కల్మషాన్ని, కుళ్ళును ఆ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా యువతకి వివరించే పని ప్రచారం యజ్ఞంలా కొన సాగించాలి.