రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు రాష్ట్ర ప్రయోజనాలపై నోరు మెదపని వారు ఈరోజు తమను విమర్శిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గుంటూరులోని తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. ఆదాయం లేకపోతే ఏపీ వెనుకబడిపోతుందని విభజన సమయంలో తాను రాజ్యసభలో చెప్పానని అన్నారు. ‘ప్రత్యేక హోదా కావాలని అడిగింది నేనే.. ఒప్పుకుంటున్నా’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను అడిగిన ఎన్నో అంశాలను కాంగ్రెస్ బిల్లులో పెట్టలేదని ఆయన ఉద్ఘాటించారు.
‘లడ్డూలు పాచి పోవచ్చు.. కానీ,
డబ్బులు పాచి పోవు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన డబ్బుని కొందరు
పాచిపోయిన లడ్డూ అంటున్నారు. ఏవేవో మాట్లాడుతున్నారు. హోదా అనే ఒక పదాన్ని పట్టుకొని
మాకు అదే కావాలని మాట్లాడుతున్నారు. హోదాకు తగిన విధంగానే ప్రత్యేక సాయం
అందిస్తామని స్పష్టం చేసినా అవే విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు
ఇప్పిస్తామని, ఆ డబ్బంతా
మళ్లీ కేంద్రమే కడుతుందనని స్పష్టంగా చెప్పింది. 'మాకవన్నీ
వద్దు' అంటూ 'మాకు హోదానే
ఇవ్వండి' అంటూ మాట్లాడుతున్నారు. పోలవరానికి అవసరమయ్యే
నిధులను 60 శాతం రాష్ట్రం, 40
శాతం కేంద్ర పెట్టుకోవాలి. హోదా వస్తే 90 శాతం కేంద్రం
భరిస్తుంది. కానీ, ప్రత్యేక సాయాన్ని ప్రకటించిన
కేంద్రం ఇప్పుడు పోలవరానికి అవసరమయ్యే 100 శాతం
నిధులని ఖర్చుపెడుతుంది’ అని వెంకయ్యనాయుడు
వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పట్ల ఆనాడు రాజ్యసభలో చూస్తూ ఊరుకోలేకపోయానని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినందుకుగానూ ఆయనకు గుంటూరులోని తెనాలిలో సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనను ఆరోజు హోదా అడిగారు అంటూ విమర్శిస్తున్నారని, అసలు హోదా అడగడంలో తప్పేముంది? అని ఆయన ప్రశ్నించారు. ఏపీ విడిపోతే రాష్ట్రానికి ఏం కావాలో అన్నీ అడగాలని తాను కాంగ్రెస్ నేతలకి చెప్పినట్లు పేర్కొన్నారు. కానీ వారు వినలేదని చెప్పారు. అందరినీ మోసం చేసి పార్లమెంటులో విభజన బిల్లు పెట్టారని చెప్పారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని చెప్పారు.
‘లోక్ సభలో ఎవరు మాట్లాడినా వారిని
బయటకు పంపేశారు. దూరదర్శన్ లైవ్ ఆపేశారు.. ఎవరినీ మాట్లాడనివ్వకుండా
చేశారు. 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. బిల్లు రాజ్యసభకి
వచ్చేసరికి చూస్తూ ఊరుకోలేకపోయాను. నేను రాష్ట్రానికి హోదా కావాలని మాట్లాడాను.
మొదటి సారిగా అద్వానీ దగ్గర కూడా గట్టిగా మాట్లాడాను.. రాష్ట్రానికి న్యాయం జరగాల్సిందేనన్నాను.
అందరు నేతలలో మాట్లాడాను. చట్టంలో ఎన్నో విషయాలు పొందపర్చాలని కోరా. ఏపీకి
న్యాయం జరిగే వరకు ఎంతవరకయినా వెళతా.. హోదా మాత్రమే కాదు, ఎన్నో అంశాలు అడిగా. అందులో అనుమానం ఏముంది..? పోలవరం ప్రాజెక్టు కడితే ముంపు గ్రామాలు మునిగిపోతాయని చెప్పాను.
విభజన బిల్లులో రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే పలు అంశాలు పెట్టలేదు. బిల్లులో
ప్రత్యేక హోదా ఉందా..? లేదు... ఎందుకు పెట్టలేదు?’
అని వెంకయ్య వ్యాఖ్యానించారు.