ఏపీ సీఎం ఎవరూ..? అని అడగగానే టక్కున చెబుతారు..? హైటెక్‌ సిటీని ఎవరు నిర్మించారు..? హైటెక్‌ సీఎం ఎవరు..? బిల్‌ క్లింటన్‌ను హైదరాబాద్‌కు రప్పించిందెవరు..? ఇలా అన్నింటికి ఒకే సమాధానం. అదీ అందరికి తెలిసిన సమాధానం నారా చంద్రబాబు నాయుడు అని..! కానీ చంద్రబాబు నాయుడుకు ఎన్ని పేర్లు ఉన్నాయంటే మాత్రం ఇదేం ప్రశ్న..అని నుదురు ముడేస్తారు..! పూర్తి పేరే నారా చంద్రబాబు నాయుడు కదా..! అని కాస్త విసుక్కుంటారు.! కానీ బాబుకు వైసీపీ మాత్రం రోజుకో పేరు పెడుతోంది.


ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తరుచూ విరుచుకుపడుతూనే ఉంటుంది. అంతేకాదు బాబుపై వైసీపీ నేతలు చేసే  కామెంట్లు, పెట్టే పేర్లు కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి. గతంలో అసెంబ్లీ సాక్షిగా కాల్ మనీ సీఎం, కామ చంద్రబాబు అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించింది ఆ పార్టీ ఎమ్మెల్యే  రోజా.. ఈ మధ్య జగన్‌ కూడా చంద్రబాబు నాయుడును దుర్మార్గపు సీఎం అంటూ కాస్త దురుసుగానే దూషిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా ఇలాంటి వివాదాస్పద కామెంట్లే చేసి మీడియాలో హాట్ టాపిక్ క్రియేట్ చేశారు. 


శ్రీకాంత్‌ రెడ్డి కాస్త ముందుకెళ్లి ఏపీ సీఎంను ఏకంగా గ్యాంగ్ స్టర్ నయీంతో పోల్చారు. చంద్రబాబు.. నారా చంద్రబాబు కాదని నయీం చంద్రబాబని కామెంట్‌  చేశారు. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు దొంగలుగా మారారని విమర్శించారు. ముఖ్యమంత్రే స్వయంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ లంచం కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడమే అందుకు ఒక ఉదాహరణ అని అన్నారు. 


ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానం కాదు.. అవినీతి అనుసంధానం జరుగుతోందని ఫైరయ్యారు. రాష్ట్రంలో ఇంత ఎత్తున అవినీతి ఆరోపణుల వస్తున్నా సీఎం మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు శ్రీకాంత్‌ రెడ్డి. సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఓ నయీం తయారవుతాడని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి  చెబుతారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: