ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసే సీఎం చంద్రబాబు ఇంకా ఆ వాదనలోంచి బయటకు రాలేదని ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన అక్కడి కాకుమాను మండలంలోని వరద ముంపు ప్రాంతాల పరిస్థితి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను, కూలిన ఇళ్లను పరిశీలించిన బొత్స బాధితులను పరామర్శించారు.
రైతులు తమ బాధలను బొత్సతో చెప్పుకున్నారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సు జరిగితే అందులో చంద్రబాబు నాయుడు వరద నష్టం గురించి చర్చించకపోవడం విచారకరమని ఆయన విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‑లకు వ్యాపారాలు తప్ప ప్రజా సంక్షేమం గురించి తెలియదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఎన్ ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందర్ని కలుపుకొని పోకుండా అభివృద్ధిలో వివక్ష చూపడం తగదని వారిద్దరు ప్రసన్నకుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
బుధవారం నెల్లూరులో నిరాహార దీక్ష చేస్తున్న నగర ఎమ్మెల్యే అనిల్‑కుమార్ యాదవ్‑ను ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయన దీక్షకు ప్రసన్నకుమార్ సంఘీభావం ప్రకటించారు. నెల్లూరు నగర అభివృద్ధిపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తు.. అనిల్ కుమార్ రెడ్డి బుధవారం నుంచి నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో గ్రామానికో నయీం తయారయ్యారని, ఇదే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు నారా చంద్రబాబు కాదు, నయీం చంద్రబాబు అని అంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు.
ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అవినీతి అనే పదమే ఆశ్చర్యపోయేలా ఏపీలో రెండేళ్లనుంచి భారీగా అవినీతి వెల్లువై పారుతోందని, టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీలు, దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా నయీం ముఠాలాగా మారిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నది నదుల అనుసంధానం కాదని, నిధుల్ని అవినీతితో చంద్రబాబు అనుసంధానం చేస్తున్నారని గడికోట దుయ్యబట్టారు. గ్రామాల్లో ఇసుకమాఫియా, నియోజకవర్గస్థాయిలో ఎల్లోట్యాక్స్ విధానం తెచ్చి అవినీతికి గేట్లు ఎత్తేశారన్నారు.