భారత సైన్యం పాక్లోని ఉగ్రస్థావరాలపై సునిసిత దాడులు, (లక్షిత దాడులు, స్వల్ప ప్రాదేశిక ప్రాంతమే లక్ష్యంగా చేసుకుని,సర్జికల్ స్ట్రయిక్స్) చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి భారతీయుడు దేశ సైన్యాన్ని చూసి గర్విస్తున్నాడు. అందరూ సర్జికల్ స్ట్రయిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అసలు ఈ సర్జికల్ స్ట్రయిక్స్ అంటే ఏమిటి? వీటిని ఎలా చేస్తారో? తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.
సర్జికల్ స్ట్రయిక్స్ ను సైన్యం పక్కా ప్రణాళికతో నిర్వహిస్తుంది. ఎక్కువ విధ్వంసం జరగకుండా ఖచ్చితమైన ప్రణాళిక, వ్యూహం తో ఎంపిక చేసుకున్న "ప్రాదేశిక లక్ష్యం" పైనే సునిశితంగా దాడులు చేయడాన్ని సర్జికల్ స్ట్రయిక్స్ అంటారు. దీని వల్ల పరిసర ప్రాంతాలకు, సాధారణ పౌరులకు నష్టం జరగకుండా చూడటం జరుగుతుంది.
కేవలం దాడి చేయాలనుకున్న "ప్రదేశం పైనే గురి" చూసి సైన్యం దాడి, విధ్వంసం పరిమితంగా చేస్తుంది. అంటే ఉగ్రస్థావరాలను గుర్తించి 100% వాటిపైనే దాడులు చేసి ధ్వంసం చేస్తారు. గ్రామాలు చిన్న పట్టణాలు, ఇతర జనావాసాలు ఎక్కువగా ఉన్నచోట దాడులు చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధానం ఉపయోగపడుతుంది.
ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లకు సైన్యం ప్రత్యేకంగాం శిక్షణ పొందిన సైనిక బృందాలను ఉపయోగిస్తుంది. భారత త్రివిధ (సైన్యం, నావికా, వైమానిక) దళాలకు ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఉన్నాయి. నిర్దేశిత ప్రాంతంలోకి సైనికులను చేరవేయడానికి వాయు మార్గం ఉపయోగిస్తారు. అంటే హెలికాప్టర్ల ద్వారా సైన్యాన్ని పంపించి మెరుపు దాడి చేసి శత్రుస్థావరాన్ని ద్వంసం చేస్తారు. కొన్ని సందర్భాల్లో వైమానిక దాడులు (ఎయిర్ స్ట్రైక్స్) కూడా చేస్తారు.
ఈ దాడులకు ఇంటెలిజెన్స్ విభాగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, లోకల్ పోలీస్ కు చెందిన సి.ఐ.డి. లాంటి సంస్థలు, ప్రజల్లోని నియమిత వేగు వర్గాలు అందించే సమాచారం ఆధారంగా ఉంటుంది. చాలా స్వలప సమయములో దాడి లక్ష్యం చేసిన చోట నిర్దేశిత విద్వంసం చేసి ముగిస్తారు.
గత ఏడాది కూడా భారత సైన్యం మయన్మార్లో ఈ తరహా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మణిపూర్లో సైనికులపై తిరుగుబాటుదారులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంతో భారత సైన్యం గట్టి సమాధానమిచ్చింది. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మయన్మార్లో దాక్కున్న 38 మంది నాగా తిరుగుబాటుదారు లను చంపేసింది. ఈ ఆపరేషన్ మొత్తం కేవలం 40 నిమిషాల్లో పూర్తిచేశారు.