బతుకమ్మ వేడుకలు షురూ..!
హైదరాబాద్:
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు బతుకమ్మలతో పూలవనాన్ని తలపిస్తున్నాయి. మహిళల ఆటపాటలు, కోలాటాలతో వీధులన్నీ మార్మోగుతున్నాయి. తొలిరోజు బతుకమ్మలను ఎంగిలిపూలతో అలంకరించిన మహిళలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ ఆడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలిపారు.
హైదరాబాద్లో భద్రత పెంపు
హైదరాబాద్:
భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ఆర్మీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలోని కంటోన్మెంట్, ఏవోసీ గేట్ ప్రాంతాల్లో సైనికాధికారులు భద్రతను పెంచారు. ఆర్మీ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే సైనికాధికారులు అనుమతిస్తున్నారు. మిగిలిన వాహనాలను మరో మార్గంలో పంపిస్తున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమల:
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబరు 3 నుంచి 11 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. అక్టోబరు 2న ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని, 3న ధ్వజారోహణం అనంతరం ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అక్టోబరు 1 నుంచి 11 వరకు తిరుమల కనుమదారిలో 24 గంటల పాటు భక్తులను అనుమతించనున్నట్లు ఈవో వెల్లడించారు.
జీశాట్ 18 కమ్యూనికేషన్ ఉపగ్రహానికి కౌంట్డౌన్
నెల్లూరు :
అక్టోబర్ 5న ఉదయం 3గంటల 30 నిమిషాలకు జిశాట్ 18 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం జరగనుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తెలిపింది. ఏరియన్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుందని తెలిపింది. జీశాట్ బరువు 3404 కిలోలు ఉంటుందని తెలిపింది. అలాగే ఫ్రెంచ్ గయానా స్పేస్ సెంటర్ వేదికగా కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం జరగనుందని తెలిపింది.