ఆంధ్రాలో కోడిపందేల జోరు కొనసాగుతోంది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రాలో ప్రత్యేకించి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడిపందేల జోరు ఓ రేంజ్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లా కోడిపందేల కేంద్రబిందువుగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది కూడా అన్నీ చోట్ల పోటాపోటీగా పందాలు నిర్వహించారు. లక్షలు, కోట్లు రూపాయలు పందాలు జరిగాయి.
కోర్టు తీర్పులు, పోలీసుల హెచ్చరికల మధ్య ఈ ఏడాది పందేలు జరుగుతాయా అన్న అనుమానం ఉన్నా.. అది కొద్దిసేపటికే పటాపంచలైపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక, భీమడోలు మండలం గుండుగొలను, భీమవరం, పెంప, ఐ. భీమవరం తదితర ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో పందాలకోసం బరులు ఏర్పాటు చేసారు. ఇక చిన్నా చితాకా లెక్కలేనన్ని ఉన్నాయి.
ఎమ్మెల్యేలు, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఆధ్వర్యంలో పందాలు ఘనంగా జరిగాయి. పెద్ద బరిలో చుట్టూ బ్యారికేడ్లు, సొంత సెక్యూరిటీలు వంటివి ఏర్పాటుచేసుకొని మీడియాను కూడా దగ్గరకు రాకుండా జాగ్తత్తపడ్డారు. బరులు చుట్టూ గుండాటలు, పేకాటలు, మధ్య విక్రయాలు కూడా సాగాయి. ఓవరాల్ గా కోడిపందేలు, వాటి పేరుతో జూదం విచ్చలవిడిగా వర్థల్లింది.
జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం లో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన దయాకర్ అనే పారిశ్రామిక వేత్త లైసెన్సు కలిగిన తుపాకీతో మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరపడం సంచలనం అయ్యింది. పందాలు నిర్వహిస్తున్నట్లు చెప్పేందుకు కాల్పులు జరిపాడు. ఈ సంఘటన మీడియాలో రావడంతో హుటాహుటిన పోలీసులు ఆ వ్యక్తిని, పందెం నిర్వహకుడిని అరెస్టుచేసారు. అటు తూర్పుగోదావరిజిల్లాలోనూ కోడిపందాలు జోరుగా సాగాయి. కోనసీమ, మెట్ట, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో పందెంరాయుళ్లు పందాలు నిర్వహించారు.