సమాజ్వాదీ పార్టీ అధ్యక్ష హోదాను, సైకిల్ గుర్తును కోల్పోయి పీకల్లోతు బాధలోఉన్న ములాయం సింగ్ యాదవ్కు మరో షాక్! ఎవరికోసంమైతే కొడుకును సైతం వదులుకోవడానికి నేతాజీ సిద్ధపడ్డాడో, ఆ ప్రియనేస్తం అమర్సింగ్ బీజేపీలో చేరబోతు న్నట్లు సమాచారం! సమాజ్వాదీ పార్టీలో తలెత్తిన విబేధాలకు అసలు కారకుడిగా, "శకుని మామ" గా విమర్శలు ఎదుర్కొన్న అమర్ సింగ్, ఎన్నికలగుర్తుపై ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడకముందే లండన్ వెళ్లిపోయారు.
'నేను ఎప్పటికీ నేతాజీ (ములాయం) మనిషినే' అని పలుమార్లు బల్లగుద్దిచెప్పిన అమర్ సింగ్ సడన్గా దిశ దశ మార్చారు. మంగళవారం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
"ఈసీ తీర్పుకు ముందే ఒక విషయం స్పష్టంగా చెప్పా, నేను ములాయంవైపుగానీ, అఖిలేశ్వైపుగానీ లేను! ప్రస్తుతం లండన్లో ఉన్నా! సమాజ్వాదీ పార్టీ నాపై వేటు వేసింది. దాన్ని నేను అంగీకరిస్తున్నా. అమిత్షాతో మంతనాలు జరిపానని అందరూ అంటున్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా, నేను బీజేపీలో ఎప్పుడు చేరబోయేది అందరికీ చెప్పాకే చేరుతా" అని అమర్ సింగ్ అన్నారు.
అఖిలేశ్లపై తనకున్న ప్రేమ గొప్పదని, ఖల్నాయక్ (విలన్) అన్నా, శకుని అన్నా భరించగలిగే ఓపిక తనకుందని అమర్సింగ్ పేర్కొన్నారు. 'ఏది ఏమైనా నేతాజీ (ములాయం) మాత్రం నన్ను విలన్గా చూడరు' అని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్నికల గుర్తును గెలుచుకున్న వాళ్లు చెడ్డవాళ్లనో, ఓడినవాళ్లు మంచివాళ్లనో అనలేం, ఆ మేరకు జరిగిన ప్రయత్నాలు సఫలమైనట్లుగానీ, విఫలమైనట్లుగానీ అభివర్ణించలేమని అమర్సింగ్ అన్నారు. అమర్ ప్రస్తుతం ఎస్పీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగు తున్నారు.