గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ వీసాల కోసం ఐదురోజుల పర్యటనలో భాగంగా గురువారం ఖతర్కు చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి, టాంకం (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ లిమిటెడ్) చైర్మన్ నాయిని నర్సింహారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ వీసాల కోసం ఐదు రోజుల పర్యటనలో భాగంగా నాయిని గురువారం ఖతర్ చేరుకున్నారు. అదే రోజు ఆయన భారత రాయబారితో సమావేశం కావాల్సి ఉంది. తనకు మంత్రి పర్యటన గురించి ఏమాత్రం సమాచారం లేదని, ఇతర పనులు ఉండటంతో కలవలేకపోతున్నట్లు రాయబారి చెప్పినట్లు సమాచారం.
దీంతో చేసేదేమీలేక తాను బస చేసిన హోటల్లోనే కొన్ని సంస్థల ప్రతినిధులతో నాయిని మొక్కుబడిగా సమావేశం నిర్వహించారు. అనంతరం అల్లుడితో కలిసి పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్లిపోయారు. తెలంగాణ యువతకు గల్ఫ్లో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నాయిని సారథ్యంలోని ఐదుగురు సభ్యుల బృందం ఖతర్, బెహ్రయిన్, కువైట్ దేశాల్లో పర్యటిస్తోంది.
అయితే తెలంగాణ సంఘాల అంతర్గత కలహాల కారణంగా మంత్రి పర్యటన గురించి ఈ 3 దేశాల్లో ఎవరికీ పెద్దగా సమాచారం లేదు. మంత్రి నాయిని ఖతర్లో తెలంగాణ కార్మికులు ఎక్కువగా ఉన్న కొన్ని కంపెనీల క్యాంపులను సందర్శించి అక్కడి ప్రతినిధులతో సమావేశం కావల్సి ఉన్నా స్థానిక నిబంధనల ప్రకారం ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మంత్రి పర్యటన ఆగమైంది. కువైట్, బెహ్రయిన్లోనూ మంత్రికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.