తిరుపతి.. దక్షిణ భారతంలోనే ప్రఖ్యాతి చెందిన టెంపుల్ సిటీ.. రోజుకు కనీసం అధమపక్షం 50 వేల మంది ఏడుకొండలవాడిని దర్సించుకుంటారు. అలాంటి తిరుపతిని మరింత బ్రహ్మాండంగా అభివృద్ది చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. మొన్నటికి మొన్న తిరుపతి వెంకన్న కొలువుదీరిన ఈ మహానగరంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1500 కోట్ల రూపాయలతో మ్యూజియం నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 



దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ సైన్స్ మ్యూజియానికి శంకుస్థాపన చేశారు కూడా ఈ మ్యూజియానికి ఏడు కొండలకు గుర్తుగా ఏడు భారీ గ్లోబులు ఏర్పాటు చేస్తారట. అసలు మ్యూజియమే పెద్ద గ్లోబుల సమాహారంగా ఉంటుందట. అందుకే ఈ మ్యూజియానికి బ్రహ్మాండ అని పేరు పెట్టారు.


ఇప్పుడు తాజాగా.. తిరుపతి నగరాన్ని అభివృద్థి చేయటానికి జపాన్ కు చెందిన ‘కుమియుమి అస్సెట్స్ కంపెనీ’ ముందుకు వచ్చింది. బుధవారం దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కుమియుమి అస్సెట్స్ మేనేజిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ యసుయో యమజకి సమావేశమయ్యారు. ఇప్పటికే పుణ్యధామం వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నామని, తిరుపతి నగరాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.


కుమియుమికి ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టుమేనేజిమెంట్ రంగాలలో ఆసక్తి వుందట. గృహ నిర్మాణం, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగాలలో జపనీస్ కంపెనీలతో కలిసి ఒక కన్సార్టియంగా ముందుకొచ్చి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకురాగలమని కుమియుమి ప్రెసిడెంట్ ప్రతిపాదించారట. దీనికి స్పందించిన సీఎం స్పష్టమైన ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కమియుమి ప్రణాళికలతో తిరుపతి అద్భుత నగరంగా భాసిల్లాలని ఆశిద్దాం..



మరింత సమాచారం తెలుసుకోండి: