ఏపీలో ఇప్పుడు కొత్త రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా రెడ్డిపై దాడి జరిగింది. గురువారం సాయంత్రం అఖిల ప్రియ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తుండగా కొంతమంది వైకాపా కార్యకర్తలు ఆమె వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకున్న విషయం తెల్సిందే. వీరంతా వైకాపా జెండాలు పట్టుకుని కారును అడ్డుకున్నారు. కారులో ఆ సమయానికి అఖిల ప్రియ, గన్మెన్, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఆ సమయానికి పోలీసులు రావడం వారి సహాయంతో కారు ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర విచారణ చేసి 8 మందిని అరెస్టు చేశారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన భూమా అఖిల ప్రియా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. వైసీపీ జెండాలు పట్టుకుని, తాగి ఉన్న కొందరు తన కారుపై దాడి చేశారన్నారు. తనపై దాడి చేసిన వారిని తప్పుపట్టాల్సింది పోయి..అసలు గొడవే జరగలేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైయస్ జగన్ ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళల పట్ల జగన్కు గౌరవం లేదా, దాడులను జగన్ ప్రోత్సహిస్తున్నారా? అని నిలదీశారు. వీడియో ఫుటేజీపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైకాపా నేత అంబటి రాంబాబు స్పందిస్తూ.. అఖిల ప్రియా రెడ్డి వాహనంపై తమ పార్టీ కార్యకర్తలు ఎవరిమీద దాడికి ప్రయత్నించలేదన్నారు. అంత అవసరం కూడా తమకు లేదని అన్నారు. అన్యాయంగా వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారని అన్నారు.