ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీనితో ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. ఇందులో ఒక ఏసీ, నాలుగు జనరల్, రెండు స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. దాదాపు 50మందికిపైనే గాయాలపాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సుమారు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది.
సంఘటన స్థలంలో పరిస్థితి బీతావాహంగా మారింది. బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు వాటిలో ఇరుక్కు పోయాయి. ఒకదానిపై ఒకటిగా పడిపోయి కనపడుతున్నాయి. బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. చెల్లాచెదురుగా వస్తువులు పడిఉన్నాయి. తమ వారి కోసం వారు ఆతృతగా వెతుకున్న వైనం కంటతడిపెట్టిస్తోంది. సమాచారం అందిన వెంటనే విజయనగరం, విశాఖపట్నం నుంచి సహాయ బృందాలు సంఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. బోగీలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకా శం ఉం దని రైల్వేవర్గాలు పేర్కొన్నాయి.
అర్ధరాత్రి.. అటవీ ప్రాంతం.. ఒక్క సారిగా పెద్ద శబ్ధం.. ఏం జరిగిందో అర్థం కాలేదు. నిద్ర నుంచి మేల్కొన్న ప్రయాణికుల అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఎలాగైనా బయట పడాలని ఆరాటంలో బోగీల్లో ఒకరిపై ఒకరు పడిపోయారు.. తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకోవడంతో కొందరు, బోగీలు పడిపోయిన తాకిడికి గాయాలై మరికొందరు విగతజీవులయ్యారు. పదుల సంఖ్యలో గాయపడిన వారి హాహాకారాలతో ఘటనా స్థలి దద్దరిల్లింది. తాము ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైందని తెలుసుకుని బోగీల్లో చిక్కుకుపోయిన వారు వణికిపోయారు. ఘటన జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. విజయనగరం రైల్వేస్టేషన్లో అధికారులు హెల్ప్లైన్ (8106053006 (ఎయిర్టెల్), 8500358712 (బీఎస్ఎన్ఎల్) ఏర్పాటు చేశారు.