లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించిన పలువురు దుండగులు విద్యార్థినులను భయాందోళనలకు గురిచేసిన ఘటన నిన్న అర్ధరాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలోని పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన హాస్టల్లో చోటుచేసుకుంది. గేటుకు వేసిన తాళాన్ని కట్ చేసి మరీ లోపలికి చొరబడ్డారు. దాదాపు గంటపాటు.. అమ్మాయిలపట్ల చెప్పుకోలేని విధంగా అసభ్యకరంగా ప్రవర్తించారు. నంద్యాల నడిబొడ్డున శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన బాలికల భద్రతపై పలు ప్రశ్నలకు తావిస్తోంది.
నలుగురు యువకులు హాస్టల్లోకి ప్రవేశించి విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషించారని, అనంతరం వారి వద్ద ఉన్న సెల్ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డి తెలిపారు. నంద్యాలలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 20 ఎకరాల ప్రాంగణంలో ఉంది. కళాశాల భవనాలతోపాటు బాలబాలికలకు విడివిడిగా హాస్టల్ భవనాలు ఉన్నాయి. విద్యార్థినుల హాస్టల్లో 60 మందికిపైగా ఉన్నారు. సంక్రాంతి సెలవులకు వెళ్లి ఇంకా రానివారిని మినహాయిస్తే..ప్రస్తుతం 20 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి (తెల్లవారితే ఆదివారం) 1.30 గంటల సమయంలో నలుగురు దుండగులు లోపలికి ప్రవేశించారు.
మొదటి అంతస్తులో 16 మంది విద్యార్థినులు గాఢ నిద్రలో ఉన్నారు. ఓ దుండగుడు కింది పోర్షన్లోని రూమ్ తలుపు తట్టడంతో విద్యార్థినులు తలుపు తీశారు. వెంటనే లోనికి ప్రవేశించిన దుండగుడిని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. అతణ్ని పక్కకు నెట్టి పై అంతస్తుకు పరుగులు తీశారు. అప్పటికే పైన మరో ముగ్గురు దుండగులు బాలికలను వేధిస్తూ కనిపించారు. నలుగురూ కలిసి అన్ని గదుల తలుపులూ తెరిపించి హల్చల్ చేశారు. సినిమా హీరోయిన్ల పేర్లతో బాలికలను పిలుస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మాటలతోనే కాక సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో దుండగులు ప్రవర్తించినట్లు తెలుస్తోంది. నంద్యాల టూటౌన్ పోలీసులకు విద్యార్థినులు ఈ రోజు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.