జనం కోసం జగన్.. జగన్ కోసం జనం.. నిజంగా జనం కోసం పరితపించే ప్రజా నాయకుడు సమకాలీన రాజకీయ నాయకుల్లో వైయస్ జగన్ ఒక్కడే అని అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. రాజకీయాల్లో జయాప జయాలు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే జగన్ ని అందరు రాజకీయ నాయకుల కంటే ప్రత్యేకత తెచ్చిపెట్టింది. ఒక్కసారి జగన్ సభలకు వెళితే తెలు స్తుంది. ముఖ్యంగా పేదల కండ్లలో జగన్ని చూడగానే ఆనందం కనిపిస్తుంది..ప్రతి అవ్వా, అమ్మా మన రాజన్న బిడ్డ తన ఇంటికి వచ్చాడని సంబురపడుతుంది.
ప్రతి అక్కా చెల్లెమ్మ తన తోడబుట్టిన వాడే తనను పలకరించడానికి వచ్చాడని మురిసిపోతుంది..ప్రతి అన్నా, తమ్ముడు తన తోడ బుట్టినవాడే తనను తోడుగా నిలబడడానికి వచ్చాడని భరోసాగా ఫీలవుతాడు..దీనికి కారణం జగన్ అంటే ఓ నమ్మకం, ఓ విశ్వసనీయత, ధైర్యం, ఓ అండ...ఓ భరోసా..జగన్ మా మనిషి..మా కుటుంబంలోని వ్యక్తి అని తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ భావించడమే. ఆయన స్వంత పార్టీ పెట్టడం పై ముందు చూపేమీ లేదని చెప్పాలి. ఆయన తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ జగన్ దూరం పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ క్రమంలోనే జగన్ సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది.
2010లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశాడు. ఆతర్వాత జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల కుట్రలను చేధిస్తూ ప్రజల మద్దతుతో అఖండ మెజారిటీతో గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత వైయస్ కు నమ్మిన బంటుల్లా ఉన్న 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ కు మద్దతు ఇచ్చారు. ఇక్కడే ఇతర రాజకీయ నాయకులకు, జగన్ కు తేడా ఏంటో దేశానికి అర్థమయింది. విలువలతో కూడిన రాజకీయాలకు జగన్ ఎంతగా కట్టుబడ్డాడో ప్రపంచానికి తెలిసింది. తన వెంట వచ్చిన 16 మంది ఎమ్మేల్యేలను రాజీనామా చేయించి, వారిని తిరిగి ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపునఅఖండ మెజారిటీతో గెలిపించిన ధీరుడు వైయస్ జగన్.
తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన జగన్ మనో ధైర్యాన్ని చూసి ప్రజలు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టిన కాంగ్రెస్ నాయకుల కంటే జగన్ ఎంతో మెరుగు అని భావించారు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన ధీరోదాత్తుడు వైయస్ జగన్ అని ప్రజలు ముక్త కంఠంతో ప్రశంసించారు. రోజు రోజుకీ ప్రజల్లో జగన్ కు ఆదరణ పెరిగిపోతుండడంతో నాటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అధికార కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టింది. జగన్ కు చెక్ పెట్టాలని కుట్రలు చేసినట్లు రాజకీయ పరి శీలకుల అభిప్రాయం. ఆ కుట్రల ఫలితమే జగన్ పై అక్రమాస్తుల కేసులు.
సిబీఐని ప్రయోగించి దాదాపు లక్ష కోట్లు అక్రమంగా కూడగట్టాడంటూ జగన్ పై కేసులు బనాయించాయి నాటి ప్రభుత్వాలు..కానీ జగన్ భయపడలేదు..ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు.ఆఖరికి కేసుల పేరుతో నేరం రుజువు కాకపోయినా సాక్ష్యాలు తారుమారు చేస్తాడంటూ జగన్ని దాదాపు రెండేళ్ల పాటు జైల్లో బందీని చేసింది నాటి ప్రభుత్వం..జగన్ ఆస్తులను జప్తు చేసి ఆర్థికంగా దెబ్బతీయాలని చూశారు..జైలు పాలు చేసినా వైయస్ జగన్ కుంగిపోలేదు.. వెనకడుగు వేసేవాడు నాయకుడు కాడు..ఆ రెండేళ్లు తన తల్లి, సోదరి అండతో పార్టీని ప్రజలతో మమేకం అయ్యేలా చేశాడు..జగన్ చేసిన ఓదార్పు యాత్రలను షర్మిల కొనసాగించింది.
దాదాపు రెండేళ్లు జైలులో పెట్టినా సిబిఐ జగన్ పై పెట్టిన కేసులను నిరూపించలేకపోయింది..దీంతో జగన్ని కోర్టు బెయిల్ పై విడుదల చేసింది..ఈ లోగా తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఉమ్మడి రాష్ట్రం విభజన దిశగా అడుగులు పడుతున్నాయి..ఇక్కడ కూడా అందరి రాజకీయ నాయకుల్లాగా రెండు కళ్ల సిద్ధాంతం పాటించలేదు. తెలుగు ప్రజలందరూ ఐక్యంగా కలిసి ఉండాలనే భావనతో వైయస్ జగన్ సమైక్యాంధ్రకు జై కొట్టాడు.. కానీ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని చెప్పాడు. మరో పక్క ఉమ్మడి రాష్ట్రంలో అయితే జగన్ క్రేజ్ ముందు గెలవలేను అనుకున్న టీడీపీ పార్టీ కూడా రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించింది. దీంతో కేంద్రం 2014లో రాష్ట్ర విభజన చేసింది.