జనసేన అధినేత పవన కళ్యాణ్ తనదైన శైలిలో ప్రత్యేక హోదా సాధనకు సిద్ధమవుతున్నారు. జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధం కావాలని పిలుపునివ్వడంతో పాటు జనసేన నిరసనను మ్యూజికల్ ఆల్బం ద్వారా వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. జల్లికట్టు ఉద్యమానికి చెన్నైలోని మెరీనా బీచ్ వేదికైతే... ప్రత్యేకహోదా పోరాటానికి విశాఖ ఆర్కే బీచ్ను వేదికగా ఎంచుకున్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం కిర్లంపూడి లేఅవుట్ ఎదురుగా బీచ్రోడ్డులో నిర్వహించే శాంతియుత నిరసన కార్యక్రమానికి పార్టీలకతీతంగా హాజరుకావాలంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
"మేము పూల గుత్తులు వేలాడే వసంత రుతువులం కాదు, వట్టి మనుషులం. దేశం మాకు గాయాలిచ్చినా, నీకు మాత్రం మేము పువ్వులనే ఇస్తున్నాం. ఓ ఆశచంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించు, ఏమి తెస్తావో మా అందరి కోసం. ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు", అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 9.40 గంటలకు ఆయన తన మనసులోని మాటను ట్వీట్ ద్వారా వెల్లడించారు. "నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యంలో చల్లలేకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నీవు బానిసగానే ఉండిపోవడానికే నిర్ణయించుకుంటే... ఆ పవిత్ర రక్తానికి నీవు ఎంత ద్రోహిగా మారావో తెలుసుకో", అంటూ ఆయన స్పందించారు.