ఏపీలో ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో వచ్చిన కాపు ఉద్యమం ఏపీని ఓ కుదుపు కుదిపేసింది. కాపులకు రిజర్వేషన్లు, ప్రత్యేక నిధుల డిమాండ్లతో జరిగిన కాపు గర్జన నానా విధ్వంసానికి కారణమైంది. తర్వాత అది కాస్త చల్లబడేసరికి సీఎం చంద్రబాబుకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనైంది. మొత్తానికి చంద్రబాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి రుణాలు మంజూరు పథకం ప్రారంభించారు. ఈ విషయంలో శాశ్వత పరిష్కారం చూపించకుండా కాపులను మోసం చేస్తున్నారంటూ ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది.
ఆ మద్య ముద్రగడ నేతృత్వంలో కాపు ఉద్యమం ఓ అడుగు ముందుకి, మూడడుగులు వెనక్కి.. అన్నట్లుగా తయారైంది. సరైన రాజకీయ కార్యాచరణ లేకుండా పోవడంతో, ముద్రగడ ఉద్యమం రోజురోజుకీ బలహీనమైపోతూనే వుంది. ఒకసారి కాదు.. ఒకటికి రెండుసార్లు ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. తాజాగా కాపు రిజర్వేషన్ సాధన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలోనే ఆయనను హౌస్ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అలాగే కాపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఉద్యమ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిని ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు.