రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. మీరు దొంగ అంటే మీరు దొంగ అనుకోవడమూ సహజమే.. కానీ మా పార్టీ నాయకుడిపై హత్యాప్రయత్నాలు చేస్తున్నారు. మా నాయకుడి భౌతికంగా అంతం చేసేందుకు కుట్రపన్నుతున్నారు అని ఆరోపిస్తున్నారంటే ఆలోచించాల్సిందే. ఈ ఆరోపణలు చేస్తున్నది వైఎస్సార్ సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ.
ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు విపరీతంగా భయపడుతున్నారని.. భౌతికంగా అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం ? వైయస్ జగన్ లేకుండా చేయలని కోరుకోవడం రాజకీయాల్లో సమంజసమేనా?
ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల్లో ఎదుర్కొంటానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఇది చేతకాని తనానికి నిదర్శనం కాదా? ఎందుకింత భయపడుతున్నారు. టీడీపీ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్లు, ధనం మూటలు చంద్రబాబుకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాయి. బాబు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం శూన్యమే. ఆయన వెనుక ప్రజలు లేరు.
బాబు తన నీడను చూసి భయపడుతున్నారు. జనం కోసం వైయస్ జగన్ పోరాటం చేస్తున్నారు. మీరు వైయస్ జగన్పై మాత్రమే పోరాటం చేస్తున్నారు. ఆయనను కనపడకుండా చేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. కేంద్రం కాళ్లు పట్టుకుంటున్నారు. మీ సర్వం ఎజెండా ఒక్కటే..మీరు వైయస్ జగన్ను జైలుకు పంపాలన్నదే మీ ఎజెండా. మీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారు... ఇలా విమర్శలు గుప్పించారు వాసిరెడ్డి పద్మ.