సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కే కొద్దీ మనుషుల ఆలోచనలు వింత పోకడలు తోక్కుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. ఆధునిక పరిజ్ఞానం పెరగడంతో అంతర్జాలం అరచేతిలోకి వచ్చిన సందర్భంలో ఇప్పుడు చిన్న చిన్న పిల్లల చేతిలో కూడా, అంటే మానసిక పరిపక్వత ఇంకా సరిగా రాణి పిల్లల చేతిలో కూడా పెద్ద పెద్ద సెల్ ఫోన్లు కనబడుతున్నాయి. చిన్న వయసులోనే వాటిని చేతబట్టి సోషల్ మీడియా ను విపరీతంగా వాడుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నారు.
చిన్న వయసులోనే కోరినవన్నీ ఇస్తున్న తల్లిదండ్రులకు వారి పిల్లలతో పెద్ద చిక్కులే వస్తున్నాయి. తన వయసుకు మించిన కోరికలు కోరి వాటిని తీర్చాలంటూ పిల్లలు తల్లి దండ్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఒక విద్యార్ధి కళాశాల పార్కింగ్లో తన వాహనం ప్రత్యేకంగా కనబడాలని బుల్లెట్ను కొనివ్వాలి. లేకుంటే కళాశాలకు పోను..మీకెవరికీ కనిపించనని బెదిరిస్తున్నాడు. బైక్ మెకానిక్తో పదో తరగతిలోనే శ్రావణి ప్రేమలోపడింది. మెకానిక్ రోజుకో బైక్పై తిప్పుతున్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించగా బ్లేడుతో కోసుకుంది. ఇంటిపై నుంచి దూకతానంటూ బెదిరిస్తోంది.
ఇలా మితిమీరిగా గారాబంతో పిల్లలు తమ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తమ తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక మితిమీరి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల దోరణుల్లో వస్తున్న మార్పులు తల్లిదండుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ అవసరాలు, అసంబద్ధమైన కోర్కెలను సాధించుకోవడం కోసం తల్లిదండ్రుల్ని భావోద్వేగాలతో లొంగదీసుకునే (ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్) ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితి రోజురోజుకీ ఎక్కువైపోతోంది.
ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ కౌన్సెలింగ్ సైకాలజిస్టుల అధ్యక్షుడు డాక్టర్ టీఎస్ రావు మాట్లాడుతూ..‘‘పిల్లల మనస్తత్వానికి తగినట్లు కొందరు తల్లిదండ్రులు వ్యవహరించలేకపోతున్నారు. పిల్లలకు కుటుంబ, ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించకుండా వారడిగినవన్నీ సమకూరుస్తుండడంతో సమస్యలు పెద్దవైపోతున్నాయి. ముఖ్యంగా ఒక్కరే పిల్లలున్న తల్లిదండ్రులు ఎక్కువ అతి గారాబం చేయడం కనిపిస్తోంది. ఇది క్రమేణా సమస్యలకు దారితీస్తోంది. పరిమితులతో పిల్లల అభిరుచులు, ఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మంచిస్నేహితుల్ని ఎంచుకునేలా వివరించాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా సర్దుకుపోయే గుణాన్ని, ఇతరుల్లోని మంచితనాన్ని గుర్తించే లక్షణాల్ని పిల్లలకు నేర్పడం చాలా అవసరం’’ అని వివరించారు.