కూచిబోట్ల శ్రీనివాస్ హత్యపై స్పందించిన సత్యనాదెళ్ల...
తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కాన్సాస్ కాల్పులపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితులైన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విట్టర్లో తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు.
తెలుగువారు మాతృభాషలో మాట్లాడొద్దు...
అమెరికాలోని బహిరంగ ప్రదేశాల్లో హిందీ లేదా ఇతర భారతీయ మాతృభాషలను ఎవరూ మాట్లాడవద్దు. అవే మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని’
అక్కడ నివసిస్తున్న తెలుగువాళ్లను సంఘాలు హెచ్చరిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనే దానికి సంబంధించిన కొన్ని సూచనలు తెలంగాణ
అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీఏటీఏ) జనరల్ సెక్రటరీ విక్రమ్ జంగమ్ చెప్పారు. యూఎస్లో ఉండే ఎన్నారైలు, మరీ ముఖ్యంగా తెలుగువాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని
పేర్కొంటూ కొన్ని సూచనలు చేశారు.
మీడియా సంస్థలపై ట్రంప్ కన్నెర్ర...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకున్నారు. ఇన్నాళ్లూ మీడియా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని
తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చిన ట్రంప్ ఈసారి ఏకంగా పలు మీడియా సంస్థలను శ్వేతసౌధంలో రోజూ జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్కు అనుమతించకుండా నిషేధం విధించారు. వైట్హౌస్
ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియా సమావేశం నుంచి సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, లాస్ఏంజిల్స్ టైమ్స్ సహా పలు మీడియా సంస్థలను మినహాయించారు. తనకు
అనుకూల కథనాలు ప్రసారం చేసే కొన్ని మీడియా సంస్థలనే ఈవెంట్లకు ఆహ్వానిస్తున్నారు.
అధికారంలోకి వస్తే.. మోదీ వాగ్దానాలు..
మణిపూర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థిక దిగ్బంధనలు ఉండవని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం
తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది నవంబర్ 1 నుంచి యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్సీ) నిరవధిక ఆర్థిక దిగ్బంధనలకు పాల్పడుతోంది. దీంతో ఇంధనంతో
సహా పలు నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంఫాల్లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై విమర్శలు
గుప్పించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడలేని వారికి ప్రభుత్వాన్ని నడిపే హక్కు లేదని అన్నారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, ఇన్నేళ్లలో కాంగ్రెస్
సాధించలేనిది బీజేపీ కేవలం 15 నెలల్లో సాధించి చూపిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు.
విరాట్ సేన ఘోర పరాజయం
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 333 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలై సిరీస్ ను
పేలవంగా ప్రారంభించింది. మూడో రోజు ఆటలో భాగంగా శనివారం 441 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది.
టీమిండియా ఓపెనర్లు మురళీ విజయ్(2) తో మొదలైన పతనకం కడవరకూ కొనసాగింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 107 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా
మూడు రోజులు జరగకుండానే ముగిసింది. భారత ఆటగాళ్లలో చటేశ్వర పూజారా(31) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.