తమ కమ్యునిస్ట్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కూడా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కి లేదు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ప్రగతి శీల కార్యకర్తలతో పాటు వామపక్ష నాయకులని కూడా హత్యలు చేయించిన వారా కమ్యునిస్ట్ ల గురించి మాట్లాడేది అన్నారు ఆయన. హైదరాబాద్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ ప్రధాని భజన లో నిండా మునిగిపోయిఉన్న బీజేపీ కి సాధారణ ప్రజలు కనపడ్డం లేదు అని నారాయణ ఎద్దేవా చేసారు. కులాలు - మతాలూ ప్రాంతాలుగా ప్రజలని విడగొట్టి వారిని రెచ్చగొట్టడమే బీజేపీ పని అని విమర్శించారు. అమెరికా లో భారతీయులని చంపడం గురించి స్పందించిన నారాయణ ఆ దేశం ఆయుధాల తయారీ కీ ప్రాక్టీస్ కీ కర్మాగారం గా మారుతోంది అన్నారు. మోడీ స్వయంగా ఆ దేశ అద్యక్షుడు ట్రంప్ తో మాట్లాడి పరిస్థితులని చక్క దిద్దాలి అని కోరారు. విదేశాంగ మంత్రి సుష్మా  స్వరాజ్ అక్కడికి చేరుకొని అయినా పరిస్థితి చక్క దిద్దే ప్రయత్నం చెయ్యకపోవడం బాధాకరం అన్నారు ఆయన. మరొక పక్క తెలంగాణా రాష్ట్రంలోని పరిస్థితి గురించి మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కలలోకి వస్తున్నారు అని ఎద్దేవా చేసారు. దేవుడికి ఆభరణాలు చేయించడానికి అది కెసిఆర్ అబ్బ సొత్తా ? అంటూ సీరియస్ అయ్యారు ఆయన. ప్రజల సొమ్ము తో ఇష్టం వచ్చినట్టు అలా ఆభరణాలు చేయించే హక్కు ఆయనకి లేదు అన్నారు నారాయణ.తెలంగాణ రాకముందు కమ్యూనిస్టులు మిత్రులు తెలంగాణ వచ్చిన తర్వాత మేము శత్రువులం అయ్యారని నారాయణ మండిపడ్డారు. ఉద్యమం అణిచివేయాలని చూసిన వాళ్ళు మంత్రులుగా కులుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: