అసలే మహిళా ఎమ్మెల్యేలు..అందులోనూ కొత్తగా ఏర్పడ్డ అసెంబ్లీ..తమ ప్రాభవాన్ని చూపించుకోవాలని ఇరు పార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద పోటీ పడ్డారు..ఒక దశలో టీడీపీ – వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు జుట్లు పట్టుకునే వరకు వెళ్లారు. మీడియా పాయింట్ వద్ద ఏపీ మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు తాము ముందు మాట్లాడాలంటే తామే ముందు మాట్లాడాలని పోటీలు పడ్డారు. మీడియా పాయింట్ దగ్గరకు ముందుగా మేం వచ్చాం అని టీడీపీ ఎమ్మెల్యే అనిత అంటే.. మాట్లాడే హక్కు మాకు లేదా అంటూ ఆమె చుట్టూ చేరి మాట్లాడటం మొదలు పెట్టారు వైసీపీ ఎమ్మెల్యేలు.
అంతే కాదు ఆ సమయంలో ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శించుకున్నారు. ఇక మైకుల టేబుల్ ని అటూ ఇటూ గుంజుతూ తాడాట ఆడినట్టు ఆడుకున్నారు. అయితే సీఎం తల నరుకుతానంటూ గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యానించినట్లు పోలీసు విచారణలో తేలిందని… వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు..అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కావాలనే టీడీపీ ఎమ్మెల్యేలు సృష్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరోవైపు తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేస్తున్నారన్నారు.
ఆడవాళ్లను ముందుపెట్టుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు పీతల సుజాత. ఒకవేళ సీఎం తల నరకుతానని తాను అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు గిడ్డి ఈశ్వరి. ఈ రకంగా ఇరు పార్టీల మహిళా ఎమ్మెల్యేలే మాటలు దాటి చేతల వరకు రావడంతో..మార్షల్స్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలను దూరంగా పంపేందుకు ప్రయత్నించినా ఎవరూ మాటా వినలేదు. మొత్తానికి కొద్ది సేపు తర్వాత టీడీపీ, వైసీపీ మహిళా ఎమ్మెల్యేల సర్ధిచెప్పి అక్కడ నుంచి పంపించారు.