కేంద్రం షాక్...2 లక్షలు దాటితే భారీ ఫైన్...
నగదు లావాదేవీల పైన కేంద్రం షాకిచ్చింది. బడ్జెట్లో రూ.3 లక్షల వరకు పరిమితి ఇచ్చింది. తాజాగా దానిని రూ.2 లక్షలకు కుదించింది. నోట్ల రద్దు తర్వాత కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది మరో కీలక నిర్ణయం. నగదు రూపంలో రెండు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరిపే అవకాశం లేదు. రెండు లక్షలకు మించి జరిపితే అంత మొత్తం జరిమానా కట్టవలసి ఉంటుంది.
మమతకు సుప్రీం షాక్.. సీబీఐకు ఓకే...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. నారద స్టింగ్ ఆపరేషన్పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడాన్ని నిలిపేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమెకు పరాభవం ఎదురైంది. విచారణ నిలిపేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో సీబీఐ విచారణకు ఇక ఎలాంటి అడ్డు ఉండే అవకాశం దాదాపు లేకుండా పోయింది. గత సంవత్సరం మార్చి నెలలో సరిగ్గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొద్ది రోజుల ముందు నారదా న్యూస్ చానల్ రెండు సీడీలను బయటపెట్టింది.
మంత్రినైనా టీవీ షోలు ఆపేది లేదు!...
పంజాబ్లో మంత్రి పదవి చేపట్టిన మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ.. తాను టీవీ షోల్లోనూ కొనసాగుతానని స్పష్టంచేశారు. మంత్రి పదవి తన టీవీ కెరీర్కు అడ్డంకి కాదని ఆయన స్పష్టంచేశారు. దీంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దీనిపై న్యాయ సలహా ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ను కోరారు. గతంలో తాను టీవీ షోలూ చేస్తున్నా.. ప్రజలు ఐదుసార్లు ఎన్నుకున్నారని, ఇప్పుడు మారాల్సిన అవసరం ఏంటని సిద్ధూ ప్రశ్నించారు. గతవారం పంజాబ్ మంత్రిగా సిద్ధూ ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
పన్నీర్ వర్గంలోకి ప్రముఖ న్యూస్ యాంకర్...
తమిళనాడు రాజకీయాలను కీలక మలుపులు తిప్పిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం వర్గం క్రమంగా బలం పుంజుకుంటోంది. జయలలిత మృతితో అధికార అన్నాడీఎంకేలో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తడంతో జరిగిన ఆధిపత్య పోరుతో ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్గా ఉన్న మధుసూదనన్తో సహా కొందరు మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్వైపు నిలిచిన విషయం తెలిసిందే. అయితే, తన అనుచరుడైన పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో శశికళ సఫలీకృతమయ్యారు.
కోహ్లిని డొనాల్డ్ ట్రంప్ తో పోల్చారు...
ఆస్ట్రేలియాతో సిరీస్ ఏ క్షణాన ఆరంభమయ్యేది కానీ భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ ఆ దేశ క్రికెటర్లు, అక్కడి మీడియా తెగరెచ్చిపోతుంది. ఇప్పటికే విరాట్ కోహ్లిపై పలుమార్లు విషం కక్కిన ఆస్ట్రేలి్యా మీడియా మరోసారి అదే స్థాయిలో విరుచుకుపడింది. తాజాగా భారత కెప్టెన్ కోహ్లిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పోల్చుతూ ఆస్ట్రేలియా పత్రిక డైలీ టెలిగ్రాఫ్ తన అక్కసు వెళ్లగక్కింది.